మంత్రి అఖిలప్రియ వ్యవహారం గందరగోళంగా సాగుతోంది. భవిష్యత్తేంటో తెలీదు. ఎవరితో ఎలా ఉండాలో తేల్చుకోలేకపోతోంది. ఫలితంగా రాజకీయ జీవితమే గందరగోళంలో పడే ప్రమాదంలో పడింది. దీనికి కారణం స్వయంకృతమనే చెప్పాలి. తాజాగా చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనలో అఖిల వ్యవహారమే ఇపుడు చర్చనీయాంశమైంది. ఎందుకంటే, చంద్రబాబు జిల్లా పర్యటనలో మంత్రి అఖిల అడ్రస్ లేదు. సిఎం పర్యటనకే డుమ్మా కొట్టిందంటే ఒక విధంగా పర్యటనను బహిష్కరించినట్లే అనుకోవాలి.ఇపుడా వ్యవహారంపైనే జిల్లా టిడిపి నేతల మధ్య చర్చలు జరుగుతోంది. విషయమేమిటంటే, మంత్రికి తెలీదు. ఎవరైనా చెబితే వినదు. యారగెన్స్..అదే అసలు సమస్య.
మంత్రి ప్రవర్తనకు కారణమేంటి ?
2014 ఎన్నికల సందర్భంగా తల్లి శోభా నాగిరెడ్డి చనిపోవటంతో ఉప ఎన్నికల్లో ఎంఎల్ఏ అయ్యింది. తర్వాత తండ్రి భూమా నాగిరెడ్డితో పాటు వైసిపిలో నుండి టిడిపిలోకి ఫిరాయించింది. కొంత కాలానికే తండ్రి కూడా చనిపోయారు. వెంటనే కారుణ్య నియామకం అనే పద్దతిలో (కాంపాసినేట్ గ్రౌండ్స్) లో మంత్రయ్యారు. అంటే, చిన్నపుడే ఎంఎల్ఏ అయిపోవటమే కాకుండా మంత్రి కూడా అయిపోయారు. అసలే ఫ్యాక్షన్ నేపధ్యమున్న కుటుంబం నుండి వచ్చింది. నోటికి అడ్డులేదు. ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా సరిగా తెలీదు. ఎవరితో ఎలా మాట్లాడినా తల్లి, దండ్రులను చూసి ఊరుకునే వారు. అటువంటి పరిస్ధితుల్లో కొద్ది కాలం తేడాలోనే ఇద్దరూ చనిపోవటంతో ఏం చేయాలో అర్ధం కాలేదు. దానికితోడు తండ్రిని నీడలా అంటిపెట్టుకుని ఉన్న ఏవి సుబ్బారెడ్డి లాంటి వారితో గొడవలు మొదలయ్యాయి. అదే సమయంలో తన ప్రమేయం లేకుండానే ఎంఎల్ఏ, మంత్రి కూడా అయిపోయింది. దాంతో జిల్లాలో అందరితోనూ గొడవలే.
ఫ్యాక్షన్ ప్రభావం
తండ్రి భూమా నాగిరెడ్డికున్న ఫ్యాక్షన్ నేపధ్యం జిల్లాలో అందరికీ తెలిసిందే. దాని వల్లే జిల్లాలో రాజకీయంగా బలమైన కుటుంబాలతో పడదు. టిడిపిలోనే ఉన్న ఉపముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి కుటుంబంతో పడదు. శాసనమండలి ఛైర్మన్ ఎన్ఎండి ఫరూఖ్ కుటుంబంతో సఖ్యత లేదు. అఖిల మంత్రైన తర్వాత కూడా పై కుటుంబాలతో శతృత్వం కొనసాగిస్తున్నట్లే కనబడుతోంది. అంతెందుకు స్వయానా మేనమామ, కర్నూలు ఎంఎల్ఏ ఎస్వీ మోహన్ రెడ్డితో కూడా మంత్రికి పడటం లేదు. తన వ్యవహారశైలి వల్లే అందరినీ మంత్రి దూరం చేసుకుంటోంది. ఆ ప్రభావం శాఖపైన కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇటువంటి పరిస్ధితుల్లోనే మంత్రిలో అభద్రత మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఆళ్ళగడ్డలో టిక్కెట్టు వస్తుందో రాదో అన్న అనుమానాలు మొదలైంది.
ఏవితో గొడవలు
సీనియర్ నేత ఏవితో మంత్రికి కుటుంబపరమైన వివాదాలున్నాయ్. ఆ పంచాయితీ తేలకపోయేసరికి ఏవిపై మంత్రి
కత్తికట్టింది. ఆ పంచాయితీ తేలేది కాదు కాబట్టే ఏవి కూడా మంత్రికి దూరమైపోయి ఎదురుతిరిగారు. దాంతో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేయకపోయిన భగ్గుమంటోంది. అందుకనే రెండు వర్గాలు రోడ్డున పడి కొట్టుకుంటున్నాయ్. వచ్చే ఎన్నికల్లో మంత్రిని కాదని ఆళ్ళగడ్డలో తనకే టిక్కెట్టు కావాలని ఏవి పట్టుపట్టారు. పార్టీలో మంత్రంటే పడని నేతలందరూ మద్దతుగా నిలబడటంతో ఏవి బలమైన పోటీదారుగా మారారు. దాంతో ఏం చేయాలో అఖిలకు అర్ధం కావటం లేదు.
మంత్రిగా కూడా ఫెయిలేనా ?
శాఖాపరంగా కానీ పార్టీ విషయంలో కానీ మంత్రి వ్యవహారశైలిపై చంద్రబాబుకు కూడా మంటగానే ఉంది. అయినా ఏం చేయలేని పరిస్ధితి. అందుకనే మంత్రిని తన ఖర్మకు వదిలిపెట్టారు. ఆ విషయం గ్రహించిన మంత్రికి చంద్రబాబు మీద అసంతృప్తి మొదలైంది. అంటే అటు పార్టీ నేతలతో పడదు. ఇటు చంద్రబాబు మీదా కోపమే. అందుకనే తనలోని అసంతృప్తిని ఎవరిమీద ఎలా చూపాలో కూడా తెలీక చివరకు చంద్రబాబు పర్యటనలో గైర్హాజరైంది. ఆగష్టు 29వ తేదీన వివాహం చేసుకుంటోంది. ఆ సాకుతో చంద్రబాబు పర్యటనలకు డుమ్మా కొట్టేసిందని పార్టీలో చర్చ జోరందుకుంది.