4 రోజులుగా చంద్రబాబు ఫుల్ హుషారుగా కనిపిస్తున్నారు. నవనిర్మాణ దీక్షలు మొదలైన రోజు నుంచి ఆయనలో చాలా ఉత్సాహం కనిపిస్తోంది. దీనికంతటికీ కారణం ఓ పెద్దాయన ఇచ్చిన రిపోర్ట్ అనేది సెక్రటేరియేట్ నుంచి అందుతున్న సమాచారం.. వచ్చే ఎన్నికల్లో కూడా మీకు ఢోకా లేదంటూ జిల్లాలవారీ లెక్కలతో సహా ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఇప్పుడు చంద్రబాబులో ఫుల్ ధీమా తీసుకొచ్చినట్టు సమాచారం.
నాలుగేళ్లుగా నవ్యాంధ్రప్రదేశ్ ను ఏలుతున్న చంద్రబాబు కొద్దిరోజుల క్రితం ఎన్డీయే నుంచి వైదొలిగారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కటీఫ్ చెప్పేశారు. దీంతో సాఫీగా సాగుతున్న ప్రయాణంలో కాస్త ఒడిదుడుకులు మొదలయ్యాయి. దీంతో ఇక చంద్రబాబు పనైపోయినట్లేనని ఊహాగానాలు మొదలయ్యాయి. బీజేపీ ఇక చంద్రబాబు అంతు చూడడం ఖాయమని, కచ్చితంగా ఏవో కేసులు పెట్టి చంద్రబాబును, ఆయన కేబినెట్ సహచరులను బొక్కలో తోయడం ఖాయమని లీకులు ఇస్తూ గందరగోళపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి లీకులతో తెలుగుదేశం శ్రేణుల్లో కాస్త అలజడి మొదలైంది.
ఏదో జరగబోతోంది అనే వార్తలతో టీడీపీలో కాస్త టెన్షన్ పెట్టే ప్రయత్నం చేసినా చంద్రబాబు దాన్ని సమర్థంగా తిప్పికొడ్తున్నారు. కక్ష సాధిస్తుందనే విషయం ముందే తెలుసని, అయినా రాష్ట్ర ప్రయోజనాలకోసం భరిస్తానని చంద్రబాబు ముందే చెప్పారు. దీంతో బీజేపీ ఏం కక్ష సాధింపు చర్యలు చేసినా అదిప్పుడు ఆ పార్టీ మెడకే చుట్టుకోవడం ఖాయం. తాజాగా జరిపిన సర్వేల రాష్ట్ర ప్రజలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. బీజేపీ అన్యాయం చేయడం వల్లే కేంద్రం నుంచి చంద్రబాబు వైదొలగారనే అభిప్రాయంతో 70 శాతానికి పైగా ప్రజలు అంగీకరించినట్టు సమాచారం. ఇది చంద్రబాబులో ఫుల్ జోష్ తీసుకొచ్చింది.
ఈనెల 1వ తేదీన లగడపాటి రాజగోపాల్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సెక్రటేరియేట్ లో ఏకాంతంగా భేటీ అయ్యారు. కొంతకాలంగా లగడపాటి రాజగోపాల్ రాష్ట్రంలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సర్వే చేయిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకే ఆయన ఈ సర్వేలు చేపట్టినట్టు సమాచారం. కేంద్రం నుంచి టీడీపీ వైదొలిగిన తర్వాత చేపట్టిన సర్వేలో మెజారిటీ ప్రజలు చంద్రబాబు నిర్ణయంపై సానుకూలంగా ఉన్నట్టు వెల్లడైంది. ఈసారి కూడా టీడీపీకే ఓటేసేందుకు ఎక్కువమంది ఓటర్లు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. బీజేపీ ఎంత చేసినా, ఏం చేసినా ఆ పార్టీకి ఓటేసే ప్రసక్తేలేదని తేల్చారట. వైసీపీ అండతోనే బీజేపీ.. టీడీపీని కాదనుకుందనే ఎక్కువమంది అభిప్రాయపడినట్టు సమాచారం. ఇక జనసేన ప్రభావం కూడా అంతంతమాత్రంగానే ఉండబోతోందని సర్వేలో తేలిందట. పవన్ ఇప్పుడు ఎంత చేసినా ఎన్నికల తర్వాత చంద్రబాబుకే మద్దతిస్తారని చాలా మంది అభిప్రాయపడ్డారట. అయితే గతంతో పోల్చితే ఈసారి ఆరేడు సీట్లు తగ్గే అవకాశం ఉందని, అయితే ప్రభుత్వ ఏర్పాటుకు టీడీపీకి ఎలాంటి ఢోకా ఉండబోదని లగడపాటి సర్వే తేల్చిందట. దీంతో చంద్రబాబు మోములో చిరునవ్వులు పూస్తున్నాయ్..! మరి చూద్దాం.. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయముంది. ఈ కాలంలో ఏదైనా జరగొచ్చు కదా..?