ప్రధానమంత్రిగా రెండుసార్లు అవకాశం వచ్చినా వదులుకున్నాను......చంద్రబాబు త్యాగం
నాకు ముఖ్యమంత్రి కావాలని లేదు..ఆ పదవి వద్దే వద్దు.....లోకేష్ త్యాగం....
నిజంగా తండ్రి, కొడుకుల త్యాగాలతో ఆంధ్రప్రదేశ్ పులకించిపోతోంది. రాజకీయాల్లో ప్రధానమంత్రి పదవి, ముఖ్యమంత్రి పదవికి మించిన పదవులు లేవన్న విషయం అందరికీ తెలిసిందే. ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా కేవలం పదవుల కోసమే వస్తారు. తమకు పదవులు ముఖ్యం కాదని, ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఎవరైనా చెబితే అబద్దమనే అనుకోవాలి. అటువంటిది తండ్రి చంద్రబాబునాయుడేమో ప్రధానమంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేశారంటే మామూలు విషయమా ? అలాగే, కొడుకు లోకేష్ కూడా తనకు ముఖ్యమంత్రి పదవిపై ఆశలేదని చెబుతున్నారంటే చిన్న విషయం కాదు. ఇంత చిన్న వయస్సులోనే లోకేష్ కు అంతటి త్యాగబుద్ది అబ్బిందంటే అభినందనీయమే.
ఇంతకీ చంద్రబాబుకు ప్రధానమంత్రి పదవి తీసుకోమని చెప్పింది ఎవరో ఎవరికీ తెలీదు. పిఎం పదవిని ఆఫర్ చేసిన నేతల పేర్లు మాత్రం చంద్రబాబు చెప్పటం లేదు. ప్రధానిగా ఉండమని ఎవరు అడిగారో చెప్పమని మీడియా ఎన్నిసార్లు ప్రశ్నించినా చంద్రబాబు నుండి సమాధానం రావటం లేదు. ఇక, తాజాగా లోకేష్ కూడా తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. తనకు ముఖ్యమంత్రి పదవిపై ఆశలు లేవంటున్నారు. అసలు లోకేష్ ను సిఎంగా ఉండమని ఎవరు అడిగారంటే మళ్ళీ మాట్లాడటం లేదు. పైగా తండ్రి ఉన్నంత వరకూ చంద్రబాబే సిఎంగా ఉండాలట.
ఇక్కడ విచిత్రమేమిటంటే చంద్రబాబు ఉన్నంత కాలం ముఖ్యమంత్రిగానే ఉండాలి. ఇంత వరకూ ఒక్కసారి కూడా సిఎం పదవి రుచిచూడని వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి పదివిని ఆశించకూడదట. సిఎం పదవిని ఆశిస్తున్న జగన్ ది మాత్రం అత్యాస, చంద్రబాబు, లోకేష్ లది మాత్రం త్యాగం. కష్టపడి ఎంఎల్ఏలను గెలిపించుకున్న జగన్ ది పోరాటం కాదు. వైసిపి తరపున గెలిచిన ఎంఎల్ఏలు, ఎంపిలను ప్రలోభాలకు గురిచేసి టిడిపిలోకి లాక్కోవటం ప్రజాస్వామ్యం. ఎలాగుంది తండ్రి, కొడుకుల లాజిక్ ?