ప్రధాన పార్టీల నేతల్లో టెన్షన్ మొదలైంది. కారణమేమిటంటే బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తో వైసిపి ఎంపిల భేటీ జరగబోతోంది. ప్రత్యేకహోదా డిమాండ్ తో వైసిపి ఎంపిలు ఆమధ్య ఐదుగురు వైసిపి ఎంపిలు రాజీనామాలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఎంపిలు రాజీనామాలు చేసిన దగ్గర నుండి టిడిపి-వైసిపి ఎంపిలు, నేతల మధ్య ఆరపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్న విషయం చూస్తున్నదే. రెండు పార్టీల మధ్య రాజీనామాల ఆమోదం అంశమే రాజకీయంగా హీట్ పెంచేస్తోంది. వైసిపి రాజీనామాలు ఉత్తుత్తి రాజీనామాలే అంటూ చంద్రబాబునాయుడు మొదలు నేతలందరూ వైసిపి ఎంపిలను ఎద్దేవా చేస్తున్నారు. అదే సమయంలో వైసిపి ఎంపిలు కూడా టిడిపిపై ఎదురుదాడి చేస్తున్నారనుకోండి అది వేరే సంగతి.
స్పీకర్ తో భేటీ
సరే, ఎవరి ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలాగున్నా ఈరోజు జరిగే భేటీలో రాజీనామాల ఆమోదంపై ఓ క్లారిటీ వస్తుందని అనుకుంటున్నారు. పోయిన వారంలోనే స్పీకర్ ఎంపిలతో భేటీ అయినా రాజీనామాలను ఆమోదించలేదు. భావోద్వేగంతో రాజీనామాలు చేస్తే ఆమోదించేది లేదనే మెలికపెట్టారు. దాంతో వైసిపి ఎంపిలపై ఆరోపణలు చేయటానికి టిడిపి నేతలకు అవకాశం వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే తమ రాజీనామాలను వెంటనే ఆమోదించాలంటూ వైసిపి ఎంపిలు స్పీకర్ పై ఒత్తిడి తెస్తున్నారు. ఎలాగైనా రాజీనామాలను ఆమోదింప చేసుకుని రాజకీయంగా చంద్రబాబును ఒత్తిడిలోకి నెట్టాలన్నది వైసిపి వ్యూహం.
రాజీనామాలు ఆమోదమైతే పరిస్ధితేంటి ?
నిజంగానే స్పీకర్ గనుక వైసిపి ఎంపిల రాజీనామాలను ఆమోదిస్తే తర్వాత ఏం జరుగుతుంది ? రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిపోతుంది. ఉప ఎన్నికలు గనుక వస్తే హోదా సెంటిమెంటును తురుపు ముక్కగా వేసి చంద్రబాబును ఫిక్స్ చేయాలన్నది వైసిపి వ్యూహం. ఐదు పార్లమెంటు స్ధానాల్లో నిజంగానే ఉప ఎన్నికలు వస్తే ప్రజల్లో ప్రత్యేకహోదా సెంటిమెంటు నిజంగానే ఉందా అన్న విషయంపై ఓ క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే, ఈ విషయంపైనే 2019 ఎన్నికలు ఆధారపడున్నాయి. హోదా డిమాండ్ సజీవంగా ఉందంటే అందుకు జగన్మోహన్ రెడ్డే కారణమన్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబే తనకు అవసరం వచ్చినపుడల్లా గోడమీద పిల్లిలాగ అటు ఇటు పదిసార్లు దూకుంటారు.
నిజంగానే సెంటిమెంటుందా ?
నిజంగానే ప్రత్యేకహోదా సెంటిమెంటు జనాల్లో ఉంటే వైసిపికే లాభం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉందని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే, రాజీనామాలు చేసిన ఎంపిలు మేకపాటి రాజమోహన్ రెడ్డి (నెల్లూరు) వరప్రసాద్ (తిరుపతి) వైవి సుబ్బారెడ్డి (ఒంగోలు), అవినాష్ రెడ్డి (కడప), మిధున్ రెడ్డి (రాజంపేట) నియోజకవర్గాల్లో పాదయాత్ర ద్వారా జగన్ కవర్ చేశారు. ఎక్కడ జగన్ పాదయాత్ర చేస్తున్నా ప్రత్యేకహోదా అంశాన్నే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కాబట్టి వైసిపి ఎంపిలే గెలిచే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఉప ఎన్నికలంటూ జరిగితే సెంటిమెంటు ఉన్నది లేనిదీ తేలిపోతుంది.