2019 ఎన్నికల్లో గెలిచి.. మోదీ మ్యానియా వన్ టైం వండర్ కాదని నిరూపించే వ్యూహాలకు మోదీ-షా టీం తుది మెరుగులు దిద్దుతోంది. విపక్షాలన్నీ ఏకమై కమలాన్ని ఓడించటమే హాబీగా పెట్టుకోవటంతో., గెలుపుకోసం ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకునేందుకు బీజేపీ శిబిరం సిద్ధంగా లేదు. అడ్డొచ్చే నిబంధనల్ని అడ్డంగా తుంచేయటానికి కూడా అమిత్ షా వెనకడుగు వేయటం లేదు. 2014ను రిపీట్ చేయాల్సిందే అనే మనోనిశ్చయంతో స్కెచ్ లు వేస్తున్నారు…
మోదీ – షా ద్వయం ముందున్న ఆప్షన్లలో అతి కీలకమైంది, పార్టీ కురువృద్ధుడు అద్వానీని మరోసారి లోక్ సభ ఎన్నికల బరిలో నిలబెట్టే వ్యూహం. ప్రస్తుతం అద్వానీ 90వ పడిలో ఉన్నారు. మోదీ – షా సిద్ధాంతాల ప్రకారం 75 ఏళ్లు దాటిన వాళ్లకు బీజేపీలో ఎలాంటి కీలక పదవుల్లోనూ ఇవ్వకూడదు. ఈ నిబంధనం చూపించే., 2014లో పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చినా.. అద్వానీ, మురళీమనోహర్ జోషీ వంటి వాళ్లను మోదీ-షా నిర్మోహమాటంగా పక్కన పెట్టారు. పార్టీ కీలక నిర్ణయాధికార కేంద్రమైన పార్లమెంటరీ బోర్డు లో కూడా ఈ ఇద్దరు సీనియర్లకు చోటు కల్పించలేదు. రాజకీయంగా బలవంతపు రిటైర్మెంట్ ఇచ్చేశారు…
పార్టీ నుంచి అద్వానీ లాంటి సీనియర్ ను దూరం చేస్తున్నారంటే.. కిందస్థాయి కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయన్న భయంతో.. మార్గదర్శక్ మండల్ అనే కొత్త వ్యవస్థనొకదాన్ని తెరపైకి తెచ్చారు. మార్గదర్శక్ మండల్లో ప్రధాని మోదీ, హోం మంత్రి, అమిత్ షాలతోపాటు అద్వానీ, మురళీ మనోహర్ జోషీలను అందులో కూర్చోబెట్టారు. ఏర్పాటు చేసిన తర్వాత ఒక్కసారి కూడా మార్గదర్శక్ మండల్ సమావేశమైన దాఖలాలు లేవు. ఇది కేవలం సీనియర్లను పక్కనపెట్టారన్న మచ్చ రాకుండా చూసుకునేందుకు చేసుకున్న ఏర్పాటుగానే విమర్శలపాలైంది…
దేశవ్యాప్తంగా ఎన్డీయే ప్రభుత్వం తీవ్ర ప్రజావ్యతిరేకత మూటగట్టుకోవటంతో మోదీ, అమిత్ షా అద్వానీతో ప్రత్యేకంగా సమావేశమై.., 2019 ఎన్నికల వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం బీజేపీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పార్టీపై మరోసారి ప్రజల్లో, కార్యకర్తల్లో విశ్వాసం నిలబడాలంటే కమలం ఎన్నికల టీంను బీజేపీ బీష్ముడు అద్వానీ ముందుండి నడిపించాల్సిన సమయం వచ్చిందన్న రాయబారంతో ప్రధాని, పార్టీ అధ్యక్షుడు ప్రత్యేకంగా కలిసి చర్చించినట్లు టాక్… నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలకన్నా.. విపక్షాల ఐక్యత మోదీని గట్టిగా దెబ్బకొడుతోంది. 2014 ఎన్నికల్లో మాదిరిగా మోదీని పూర్తిగా ముందు పెట్టి ఒట్లడిగే పరిస్థితి రాను రాను కనుమరుగవుతోంది. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే అద్వానీని రంగంలోకి దించుతున్నట్లు టాక్…
అద్వానీ అంటే బీజేపీలో ఓ ప్రభంజనం. 1984 లోక్ సభలో కేవలం 2 సీట్లకే పరిమితమైన బీజేపీని 1989 కల్లా 85 సీట్లకు.. 1991 కల్లా 120 సీట్లకు ఇలా క్రమక్రమంగా పెంచుకుంటూ.., 1996లో 161 సీట్లకు చేర్చి.. తొలిసారి అధికార పీఠంలో కూర్చోబెట్టిన ఘనత అద్వానీదే. ఆయన ప్రాణాలకు తెగించి చేపట్టిన రథయాత్రలతోనే బీజేపీ ఉత్తర-పశ్చిమ భారతదేశాల్లో అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ ను ఢీకొనే స్థాయిలో విస్తరించిందనేది నిర్వహివాదాంశం. దురదృష్టం వెంటాడటంతో., 2004, 2009 ఎన్నికల్లో అద్వానీ నేతృత్వంలో పోటీ చేసిన కమలం.., లోక్ సభలో దారుణంగా బలాన్ని కోల్పోయింది. 2004లో ఎన్నికల్లో 138 సీట్లు.. 2009 ఎన్నికల్లో 116 సీట్లు సాధించటం ద్వారా బీజేపీలో అద్వానీ ప్రభ మసకబారిపోయింది. ఎన్డీయే రాజకీయంగా ప్రతిపక్షపాత్రకే పరిమితమైంది. 2004-2009 మధ్య ఐదేళ్ల పాటు అద్వానీ సమర్థవంతమై ప్రతిపక్షనేత పాత్ర పోషించినప్పటికీ.., మరోసారి ఎన్డీఏని అధికారంలోకి తేవటంలో విఫలమయ్యారు. కానీ బీజేపీపై ఆయన పట్టు నిలుపుకుంటూ వచ్చారు.