చంద్రబాబునాయుడుపై ఎఫ్ఐఆర్ తప్పదా ? పరిస్ధితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు చుట్టూ భారతీయ జనతా పార్టీ పకడ్బందీగా ఉచ్చు బిగిస్తున్నట్లు కనబడుతోంది. ఎప్పుడైతే చంద్రబాబు ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేశారో అప్పటి నుండే అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. తనపై ఏదో ఓ కేసు నమోదు చేసి ఇబ్బందులు పెట్టాలని కేంద్రం ప్రయత్నిస్తోందంటూ చంద్రబాబే స్వయంగా ఎన్నోసార్లు బహిరంగంగా చెప్పిన విషయం అందరికీ తెలిసిందే .
టిడిపిలో ఎయిర్ ఏషియా ప్రకంపనలు
ప్రస్తుత విషయానికి వస్తే తాజాగా వెలుగు చూసిన ఎయిర్ ఏషియా కుంభకోణం తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇద్దరు ఎయిర్ ఏషియా యాజమాన్యం, మధ్యవర్తి, విమానయాన శాఖ సిఇవో మధ్య జరిగిన సంభాషణల్లో చంద్రబాబు, విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు పేర్లు ప్రస్తావనకు రావటమే ప్రధాన కారణం. అర్హత లేని విమానయాన సంస్దకు అంతర్జాతీయం లైసెన్సు రావాలంటే చంద్రబాబు వల్లే సాధ్యమవుతుందని మధ్యవర్తి చెప్పిన విషయం ఆడియో టేపుల్లో స్పష్టంగా వినబడుతోంది. తర్వాత అదే సంస్ధకు అశోక్ అంతర్జాతీయ లైసెన్సులు ఇవ్వటంపై ఆడియో టేపుల్లోని సంభాణషలు నిజమే అని అనుకోవాల్సొస్తోంది.
బిగుసుకుంటున్న ఉచ్చు ?
తాజాగా బయటడిన కుంభకోణంతో సంబంధాలున్నవారిలో ఇప్పటికే పలువురిని సిబిఐ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు, అశోక్ ను కూడా సిబిఐ విచారిస్తుందన్న ప్రచారం ఊపందుకుంది. దానికి తగ్గట్లే, బిజెపి రాజ్యసభ సభ్యుడు, జాతీయ అధికార ప్రతినిధి జివిఎల్ నరసింహారావు మాట్లాడుతూ, ఆడియో టేపుల్లో ప్రస్తావనకు వచ్చిన పేర్లన్నింటిపై ఎఫ్ఐఆర్ తప్పదన్నారు. ఆధారాల ప్రకారమే సిబిఐ కేసులు నమోదు చేస్తుందన్నారు. తప్పు చేయకపోతే చంద్రబాబుకు భయం ఎందుకంటూ జీవిఎల్ నిలదీశారు. కుంభకోణానికి సంబంధించిన ఆడియో టేపులు బయటపడగానే టిడిపి నేతలు ఎందుకు ఆందోళన పడుతున్నారో తనకు అర్ధం కావటం లేదన్నారు. జివిఎల్ మాటలు చూస్తుంటే చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
సానుబూతి గురించే ఆలోచిస్తున్న బిజెపి
నిజానికి రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులపైనే చాలా అవినీతి ఆరోపణలున్నాయి. పట్టిసీమ ప్రాజెక్టులో రూ. 400 కోట్ల అవినీతి జరిగిందని స్వయంగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పేర్కొన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ నివేదిక ఆధారంగానే కేంద్రం విచారణ జరిపించి కేసులు పెడుతుందని అనుకున్నారు. అయితే, ఆ పనిచేస్తే చంద్రబాబుకు జనాల్లో సానుభూతి వస్తుందని బిజెపి అంచనా వేసింది. దానికి తగ్గట్లే చంద్రబాబు కూడా ముందుగానే కేంద్రం, కేసులంటూ సానుబూతికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. దాంతో కేంద్రం వెనక్కు తగ్గింది. ఈ నేపధ్యంలోనే హటాత్తుగా ఎయిర్ ఏషియా కుంభకోణం వెలుగు చూసింది. తాజాగా జివిఎల్ మాటలను బట్టి చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ తప్పదని అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. ఏం జరుగుతుందో చూడాలి ?