ఆలూ లేదు చూలు లేదు అల్లుడిపేరు సోమలింగం అన్నట్లుంది చంద్రబాబునాయుడు మాటలు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళయినా ఇంత వరకూ రాజధాని నిర్మాణానికి శంకుస్ధాప రాయి వేయటం తప్ప ఒక్క ఇటుక కూడా లేవలేదు. అటువంటిది వరల్డ్ సిటీ సమ్మిట్ లో అమరావతి నిర్మాణాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తామని చంద్రబాబు చెబుతున్నారు. గురువారం సింగపూర్ మంత్రి ఈశ్వరన్-చంద్రబాబు భేటీ జరిగింది. అమరావతి అభివృద్ధికి ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందాలను వివరించారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ , సీఎం చంద్ర బాబు సమక్షంలో గురువారం ఒప్పందం జరిగింది. ఒప్పంద పత్రాలపై అమరావతి డెవలప్మెంట్ కమిటి వైస్ చైర్మన్ లక్ష్మీ పార్థసారధి, సిఆర్డిఏ కమిషనర్ శ్రీధర్, సింగపూర్ అధికారులు సంతకాలు చేశారు.
పనులన్నీ పారదర్శకమేనట
అమరావతిని మూడు దశల్లో, 15ఏళ్లలో అభివృద్ధి చేయటానికి ఒప్పందం కుదిరినట్లు చంద్రబాబు చెప్పారు. పనులన్నీ పూర్తిగా పారదర్శకంగా జరుగుతాయని చెప్పటం పెద్ద జోక్. ఒప్పందాలనే బహిర్గతం చేయని చంద్రబాబు పనులు పారదర్శకంగా జరుగుతాయంటే ఎవరైనా నమ్ముతారా ? అమరావతి అభివృద్ధికి రాష్ట్రం మూడు దశల్లో సింగపూర్ కంపెనీలకు భూమి కేటాయిస్తుందని చంద్రబాబు చెప్పారు. సాలిడ్ వేస్ట్ మనేజ్మెంట్ లో మంచి పద్ధతులు ఇక్కడ అమలు చేస్తామన్నారు. నైపుణ్యాభివృద్ధి కోసమే సింగపూర్ మెష్ సంస్థ తో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. సింగపూర్ నుంచి రాకపోకలు సాగించడానికి అన్ని అనుమతులు ఇస్తామన్నారు. వచ్చే నెలలో జరిగే సమ్మిట్ లోగా విజయవాడ నుంచి ఎయిర్ కనెక్టివిటీ ఇస్తామని తెలిపారు.
పనులు వేగవంతం చేస్తాం
సింగపూర్ మంత్రి ఈశ్వరన్ మాట్లాఉతూ, సింగపూర్ సంస్ధలు-ఏపి ప్రభుత్వం మధ్య అమరావతి నిర్మాణానికి ఒప్పందం జరగటం ఓ మైలురాయన్నారు. ఎంతో దార్శనికతతో ఎలాంటి న్యాయ పరమైన ఇబ్బందులు రాకుండా ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందాన్ని మనఃపూర్తిగా స్వాగతిస్తున్నట్లు చెప్పారు. తమ సంస్ధలు ఇప్పటికే ఇక్కడ పని చేస్తున్నట్లు చెప్పారు. పనుల్ని వేగవంతం చేస్తామని విస్తృత ప్రయోజనాల కోసమే ఇరు పక్షాలు కలిసి పని చేస్తున్నట్లు మంత్రి చెప్పటం గమనార్హం.
స్టార్టప్ ఏరియా అభివృద్ధికి 1691 ఎకరాలు
సమావేశంలో పాల్గొన్న సింగపూర్ రాయబార సిబ్బంది.,రాష్ట్ర మంత్రులు యనమల, నారాయణ డిసెంబర్ 2014లో సింగపూర్ తో అవగాహన కుదిరింది. అప్పట్లో సీడ్ ఏరియా అభివృద్ధి కోసం ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. అలాగే స్టార్ట్ అప్ ఏరియా క్రింద 1691ఎకరాల అభివృద్ధి కోసం స్విస్ ఛాలెంజ్ పద్దతిలో అభివృద్ధి చేయాలని సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది. ఇందులో అమరావతి డెవలప్మెంట్ పార్టనర్ షిప్ లో ఏడిసికి 42 శాతం వాటా ఉంటుంది. సింగపూర్ అమరావతి ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ భాగస్వామ్యంలో మొదటి దశలో 666 ఎకరాల అభువృద్ది జరుగుతుంది. అదేవిధంగా, ఐటీ, బ్యాంకింగ్ రిటైల్ బిజినెస్, ఎంటర్టైన్మెంట్ రంగాలలో అభివృద్ధి జరుగాలని కూడా నిర్ణయమైంది.
అమరావతిని సింగపూర్ గా మార్చండి
చంద్రబాబు మాట్లాడుతూ, సింగపూర్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. అమరావతిని సింగపూర్ గా మార్చాలని కోరారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా నదీ అభిముకంగా అమరావతి ప్రాంతం ఉందన్నారు. అమరావతి లో ఉన్న మానవ వనరుల్ని వాడుకుని అత్యుత్తమ నగరాన్ని నిర్మించమని సింగపూర్ మంత్రిని కోరారు.