తిరుమలలో ఆగమశాస్త్ర నియమాలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగుతున్నాయంటూ ఇటీవలికాలంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఐవైఆర్ కృష్ణారావు మొదలు రమణదీక్షితులు ఇదే అంశంపై పెద్ద క్యాంపెయిన్ చేస్తున్నారు. అయితే టీటీడీపై చేస్తున్న అసత్య ఆరోపణలను ఏమాత్రం సహించకూడదని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. ఇందుకోసం న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది.
టీటీడీ పాలకమండలికి, రమణదీక్షితులకు మధ్య తలెత్తిన వివాదం కంటిన్యూ అవుతూనే ఉంది. అందుకే దీనికి వీలైనంత త్వరగా ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటోంది టీటీడీ. అందుకే న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది. ఎవరికి వారే విషయాన్ని తీవ్రంగా తీసుకోవడంతో.. విషయం మరింత జఠిలమయ్యేలా కనిపిస్తోంది. టిటిడి లీగల్ నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. మూడ్రోజుల క్రితం రమణ దీక్షితులు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి తిరిగి కొన్ని అరోపణలు సంధించారు. తనపై వస్తున్న ఆరోపణలకు సీబీఐ ఎంక్వైరీకి సిద్ధమన్నరమణ దీక్షితులు.. టీటీడీ పాలకవర్గం అందుకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఈసారి ఆయన ప్రధానంగా జేఈవోలను టార్గెట్ గా చేసుకున్నారు. దీనిపై టిటిడి బోర్డు స్పందించింది. స్వామి వారి ఆభరణాలేమీ పోలేదని.. అన్నింటిని ప్రదర్శనకు పెడతామని ఈవో అనిల్ సింఘాల్ స్పష్టం చేశారు. అసత్య ప్రచారంతో తిరుమల తిరుపతి దేవస్థానం పరువు తీస్తున్నవాళ్లందిరికి నోటీసులు ఇస్తామని ఇవో స్పష్టం చేశారు. మీడియాకు కూడా నోటీసులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ప్రకటించారు.
రమణదీక్షితులు సవాల్ ను ఫేస్ చేసేందుకు జేఈవోలు సిద్ధమయ్యారు. ఎన్నో ఏళ్లుగా స్వామివారి సేవలో ఉంటున్న తమపై అసత్య ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. మరోవైపు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యసామి తిరుమల విషయమై కోర్టుకు వెళ్తామని గతంలో స్పష్టం చేశారు. వేసవి సెలవులు పూర్తి కాగానే కోర్టులో రిట్ వేస్తానని ఆయన చెప్పారు. దీనికి కూడా ఈవో సమాధానం ఇచ్చారు. పదేపదే ఆరోపణలు చేస్తున్న రమణ దీక్షితులకు పరువునష్టం కేసుతో చెక్ పెడతామని ఈవో చెప్పారు. మరోవైపు.. తాము ఏం చేసినా పద్ధతి ప్రకారం చేస్తామని.. రమణ దీక్షితులకు దేవుడే తగిన శాస్తి చేస్తాడన్నారు టీటీడీ ధర్మకర్తల మండలి ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్.
రమణదీక్షితులకు నోటీసులు ఇస్తామని గతంలోనే టిటిడి అధికారులు ప్రకటించారు. రమణ దీక్షితుల ఆరోపణలకు సంబంధించి భక్తుల్లో ఎటువంటి సందేహాలు లేవని ఈవో అనిల్ సింఘాలే ధృవీకరించారు. భక్తుల అనుమానాలు తీర్చేందుకు తాము అన్ని ప్రయత్నాలు చేశామన్నారు. రమణదీక్షితులతో పాటు మీడియాకు కూడా నోటీసులిస్తామని టిటిడి ధర్మకర్తల మండలి స్పష్టం చేయడంతో ఈ వ్యవహరం ముందుముందు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.!?