ఇటీవలికాలంలో వైసీపీ నేతల విమర్శలు స్థాయి దాటిపోయాయి. వ్యక్తిగత విమర్శలకే అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు ఆ పార్టీ నేతలు. ముఖ్యంగా సీఎం చంద్రబాబునే ఎక్కువగా టార్గెట్ గా చేసుకున్నారు. ఆయనపై అవినీతి ఆరోపణలు చేయడం చాలా కామన్. అయితే ఇటీవల వైసీపీ నేతలు ఆయన ఆరోగ్యంపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.
చంద్రబాబుకు తెల్లబొల్లి మచ్చలు ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. గడ్డం, చేతులు తదితర భాగాల్లో అది బహిరంగంగానే కనిపిస్తూ ఉంటుంది. అది దాచుకుంటే దాగేది కూడా కాదు. అయినా దాన్నెప్పుడూ ఆయన నామోషీగా ఫీలవ్వలేదు. అసలు దాని గురించి ఆయన పట్టించుకోరు. అయితే అప్పుడప్పుడూ ప్రత్యర్థులు ఆయన బొల్లిమచ్చలను కామెంట్ చేస్తుంటారు. నాడు కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది నేతలు., ఆ తర్వాత వైసీపీ నేతలు ఎంతోమంది ఆయన బొల్లిమచ్చలపై జోకులు పెల్చేవారు. సెటైర్లు వేసేవారు. అయితే ఏనాడూ చంద్రబాబు వాళ్ల విమర్శలపై కామెంట్ చేయలేదు.
అయితే ఈ మధ్యకాలంలో వైసీపీ నేతలు ఆ బొల్లి మచ్చలపై వింత విమర్శలు చేస్తున్నారు. ఆయనకో వింత చర్మరోగం ఉందని, అందుకే చంద్రబాబు బంగారు ఆభరణాలుకానీ, గడియారాలు కానీ వేసుకోరని విమర్శించారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు.. ఇటీవల గుంటూరులో జరిగిన పార్టీ నేతల శిక్షణా సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు. చంద్రబాబుకు ఆ జబ్బు ఉండడం వల్లే ఆభరణాలు, గడియారాలు పెట్టుకోరని శ్రేణులకు వివరించారు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో విస్మయం వ్యక్తమైంది. ఆ జబ్బు ఉండడం వల్లే ఆయన అలాంటివి పెట్టుకోరని, అయితే జనాలకు మాత్రం తాను సింపుల్ మ్యాన్ అని బిల్డప్ ఇచ్చుకుంటారని అంబటి వ్యాఖ్యానించారు.
అయితే తెల్లబొల్లి మచ్చలు ప్రపంచంలో చాలా మందికి వచ్చే చర్మసంబంధమైన సమస్య అని డాక్టర్లు వివరిస్తున్నారు. కొన్ని జన్యులోపాల వచ్చే ఈ సమస్యతో ఎలాంటి ఇబ్బందులు ఉండబోవన్నారు. ఎలాంటి ఆభరణాలనైనా, గడియారాలనైనా నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చని సూచిస్తున్నారు. బొల్లి మచ్చలతో ఎలాంటి ఇతర సమస్యలు ఉండబోవన్నారు. బొల్లి మచ్చల జబ్బు ఉండడం వల్లే ఆయన ఆభరణాలు, గడియారాలు పెట్టుకోవట్లేదనే కామెంట్లను వాళ్లు తప్పుబడుతున్నారు. అలాంటి మచ్చలు ఉండే వాళ్లు ఇలాంటివి ధరించడం వల్ల ఎలాంటి సమస్యలు రాబోవన్నారు. ఏదైతేనేం.. ఇటీవలికాలంలో వైసీపీ నేతలు చేస్తున్న వ్యక్తిగత విమర్శలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.