చంద్రబాబునాయుడు నాలుగేళ్ళ పాలనపై వైసిపి చార్జిషీట్ విడుదల చేసింది. శుక్రవారం పార్టీ కార్యాలయంలో సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు మీడియా సమావేశంలో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. మీడియా సమావేశంలోనే చార్జిషీటును కూడా విడుదల చేశారు. తాము విడుదల చేసిన చార్జిషీటును పోయిన ఎన్నికల్లో చంద్రబాబు విడుదల చేసిన మ్యానిఫెస్టోతో పోల్చుకుని చూసుకోవచ్చని కూడా ఉమ్మారెడ్డి సవాలు విసిరారు.
హామీల అమలులో విఫలం
పోయిన ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హమీలు అమలవుతున్న విధానంపై ఉమ్మారెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ మొత్తం రూ. 87 వేల కోట్లైతే ముఖ్యమంత్రైన తర్వాత అనేక కమిటీలు వేసి ఆ మొత్తాన్ని రూ. 24 వేల కోట్లకు తగ్గించేశారంటూ మండిపడ్డారు. అది కూడా ఇప్పటి వరకూ మాఫీ అయింది కేవలం రూ. 13 వేల కోట్లే అన్నారు. నాలుగేళ్ళ క్రిందట చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తేదీనే వైసిపి చార్జిషీట్ విడుదల చేయటం గమనార్హం.
రాజధాని ఎందుకు నిర్మించలేదు ?
మ్యానిఫెస్టోలో చెప్పినట్లుగా ఇంటికో ఉద్యోగం కానీ లేకపోతే రూ 2 వేల నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండా చంద్రబాబు మోసం చేసినట్లు ఆరోపించారు. రాష్ట్రంలో ఒక కొత్త పరిశ్రమ అయినా వచ్చిందా ? ఒక ఉద్యోగం అయినా ఇచ్చారా ? అంటూ నిలదీశారు. డ్వాక్రా మహిళన రుణాలు ఎందుకు రద్దు చేయలేదంటూ మండిపడ్డారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా రాజధానిని ఎందుకు నిర్మించలేకపోయారో చంద్రబాబు జనాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటి కూడా చంద్రబాబు అమలు చేయలేదని ఉమ్మారెడ్డి తేల్చిచెప్పారు.