నాలుగేళ్ళ వైఫల్యాలతోనే చంద్రబాబునాయుడు మళ్ళీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. వైఫల్యాలని ఎందుకు అనాల్సొచ్చిందంటే పోయిన ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ సంపూర్ణంగా అమలు చేయలేకపోవటమంటే వైఫల్యం క్రిందనే లెక్క వేయాలి కదా ? గతంలో రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినపుడు పాలనపై తనదంటూ చంద్రబాబు ఓ ముద్ర వేసుకున్నారు. కానీ పదేళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత చంద్రబాబు ఆలోచనల్లో బాగా మార్పొచ్చింది. ఆ మార్పుకు తోడు 2014 రాష్ట్ర విభజన జరిగింది. విభజిత ఏపికి ఎలాగైనా ముఖ్యమంత్రి అవ్వాలన్న ఏకైక లక్ష్యంతో ఆచరణ సాధ్యం కాని అనేక హామీలిచ్చారు. సరే, మోడి, పవన్ రూపంలో అన్నీ పరిస్ధితులూ కలిసి రావటంతో అధికారంలోకి వచ్చారు. అక్కడి నుండే చంద్రబాబుకు సమస్యలు మొదలయ్యాయి.
అదృష్టంతోనే సిఎం అయిన చంద్రబాబు
ఎలాగంటే, అధికారంలో వస్తానన్న నమ్మకం లేకే అడ్డదిడ్డమైన హామీలిచ్చేశారు. కానీ ఆశ్చర్యంగా వెంట్రుకవాసి అదృష్టంతో సిఎం అయిపోవటంతో ఇచ్చిన హామీలను అమలు చేయలేక చేతులెత్తేశారు. దానికి తోడు హామీల అమలును పక్కనపెట్టినా పాలనా వైఫల్యాలు కూడా ఎక్కువైపోయాయి. అదే సమయంలో పార్టీపైన కూడా అదుపు తప్పిపోయింది. దాంతో అన్నీ రంగాల్లోనూ చంద్రబాబు వైఫల్యాలు మూటగట్టుకున్నారు.
విభజన హామీల అములులో ఫెయిల్
మోడి, పవన్ తో జట్టుకట్టిన చంద్రబాబు మొత్తానికి అధికారంలోకి వచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కుండమార్పిడి పద్దతిలో బిజెపి, టిడిపి అధికారాన్ని పంచుకున్న విషయం అందరికీ తెలిసిందే. కేంద్రంలో ఇద్దరు టిడిపి ఎంపిలు మంత్రులుగా ఉండి కూడా రాష్ట్రానికి వచ్చిన లాభం ఏమీ కనబడలేదు. పైగా విభజన చట్టాన్ని అమలు చేయించటంలో కూడా చంద్రబాబు ఫెయిల్ అయ్యారు. ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వేజోన్ సాధించిటంతో పాటు కేంద్రం నుండి రావాల్సిన ఏ ప్రయోజనాన్ని పూర్తిగా రాబట్ట లేకపోయారు. దాంతో జనాల్లో చంద్రబాబుపై వ్యతిరేకత మొదలైపోయింది.
రుణమాఫీల్లోనూ ఫెయిలే
విభజన హామీల మాటను పక్కనపెట్టినా తానిచ్చిన హామీల అమలులో కూడా ఫెయిలయ్యారు. ఎన్నికల సమయంలో రైతు రుణాలు, డ్వక్రా సంఘాల రుణాలు మాఫీ చేస్తానన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పారు. ఇవ్వలేకపోతే నెలకు రూ. 2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు. కాపులను బిసిల్లో, బోయలను ఎస్టీల్లో చేరుస్తానని హామీ ఇచ్చారు. సందర్భానికి తగ్గట్లుగా కులానికో హామీ మతానికో ప్రామిస్ ఇలా నోటికొచ్చిన హామీలు ఇచ్చుకుంటూ పోయారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీలు, కాపులు, బోయల రిజర్వేషన్ విషయంలో ఏమి చేశారో అందరూ చూశారు. ఇంటికో ఉద్యోగమన్నది ఎవరూ అమలు చేయలని హామీ. కానీ చంద్రబాబు తేలిగ్గా ఇచ్చేశారు. సిఎం అయిన తర్వాత ఏం చేశారు ? అటు ఉద్యోగమూ ఇవ్వలేదు కదా పోనీ నిరుద్యోగ భృతైనా ఇచ్చారా ? అంటే అదీ లేదు. ఈ విధంగా ఇచ్చిన 600 హమీల్లో ఏ ఒక్కటీ సంపూర్ణంగా అమలు చేయలేక చతికిల పడ్డారు.
పాలనకు ఏమైంది ?
హామీల అమలులో ఫెయిల్ అయ్యారు సరే, మరి పాలనా అనుభవానికి ఏమైంది ? అన్నీ రంగాల్లోనూ ఫెయిలే. గడచిన నాలుగేళ్ళల్లో శాంతి, భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. వెలుగు చూసిన అనేక కేసుల్లో ఎక్కువ భాగం టిడిపి నేతలే సూత్రదారులుగా బయటపడింది. ఎవరి పైనా చర్యలు లేవు. కాల్ మనీ సెక్స్ రాకెట్, పేకాట క్లబ్బుల నిర్వహించటం, మహిళలపై దాడులు, అధికారులపై దాడులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది. అధికార పార్టీ నేతలు కాబట్టే పోలీసులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. ఎప్పుడైతే తమపై చర్యలు ఉండవని తెలుసుకున్నారో శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, ల్యాండ్ మాఫియా రూపంలో పలువురు టిడిపి నేతలు రెచ్చిపోతున్నారు. ఇదంతా పాలనా వైఫల్యం క్రిందకే వస్తుందనటంలో సందేహం లేదు.
పార్టీపైనా తప్పిన అదుపు
అదే సమయంలో పార్టీ నేతలపైన కూడా చంద్రబాబుకు అదుపు తప్పిపోయింది. మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏల్లో అత్యధికులు చంద్రబాబు మాటను ఖాతరు చేయటం మానేశారు. ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం, కర్నూలు, కడప, విజయనగరం, తూర్పుగోదావరి, కృష్ణా, అనంతపురం జిల్లాల్లో మంత్రులు, ఎంపి, ఎంఎల్ఏల మధ్య ప్రత్యక్షంగానే గొడవలవుతున్నాయి. వాళ్ళ మధ్య చంద్రబాబు ఎన్ని పంచాయితీలు చేసినా వాళ్ళెవరూ మాట వినటం లేదు. దాంతో పార్టీపై చంద్రబాబుకు అదుపు లేదన్న విషయం స్పష్టమవుతోంది.
మొదలైన ఎన్నికల టెన్షన్
ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో ఒకవైపు పాదయాత్రతో దూసుకుపోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇంకోవైపు ఆరోపణలతో విరుచుకుపడుతున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, పక్కలో బల్లెంలా తయారైన బిజెపి, జనాల్లో పెరిగిపోతున్న వ్యతిరేకత లాంటి అనేక కారణాలతో చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది. వైఫల్యాలు స్పష్టంగా కనబడుతుండటంతో ఏదో ఓ కార్యక్రమం పెట్టుకుని జనాల ముందు సొంత డప్పు కొట్టుకుంటున్నారు. మరి, అందరి నేతలను బేరీజు వేసుకుంటున్న జనాలు ఎటువంటి తీర్పిస్తారో చూడాల్సిందే ?