చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై కోర్టుల్లో కేసులు వేయటం ద్వారా న్యాయ పోరాటం జరపాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. అంటే ఒకపుడు కాంగ్రెస్, టిడిపిలు కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కేసుల్లో ఇరికించిన పద్దతిలోనే ఇపుడు వ్యవహారాలు నడుస్తున్నాయా అన్న అనుమానాలు మొదలయ్యాయి. కేంద్రప్రభుత్వం ఇస్తున్న నిధుల్లో పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి జరుగుతోందిని బిజెపి నేతలు అంటున్నారు. ఆదివారం జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయించటం గమనార్హం. నిజంగానే బిజెపి నేతలు గనుక చంద్రబాబుపై కోర్టులో కేసులు వేస్తే వ్యవహారం చాలా సీరియస్ అవుతుందనటంలో సందేహం లేదు.
కేంద్ర పథకాల్లో అవినీతి ?
కేంద్రప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు నడుస్తున్నాయి. పేదలకు ఇళ్ళ నిర్మాణం, గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు, పర్యావరణ రక్షణ కోసం నీరు-చెట్టు, రాజధాని నిర్మాణంలో జరిగిన అవినీతి తదితరాలపై సాక్ష్యాధారాలతో సహా కోర్టుల్లోనే కాకుండా కేంద్ర విజిలెన్స్ శాఖకు కూడా ఫిర్యాదు చేయాలని సమావేశంలో బిజెపి నేతలు నిర్ణయించారు. ఒకవేళ బిజెపి నేతలు కేంద్ర విజిలెన్స్ శాఖకు ఫిర్యాదు చేస్తే దర్యాప్తు సంస్ధలు తక్షణమే రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. విజిలెన్స్ సంస్ధ దర్యాప్తు, నివేదిక ఆధారంగా కోర్టులు కూడా యాక్టివ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
సానుభూతి సంపాదించుకుంటారా ?
ఇప్పటికే చంద్రబాబుపై సుప్రింకోర్టులో ఓటుకునోటు కేసు దాఖలైన సంగతి అందరికీ తెలిసిందే. వివిధ కారణాలతో ఆ కేసు విచారణకు రావటం లేదు. ఇపుడు తాజాగా బిజెపి వేయాలనుకుంటున్న కేసులు గనుక విచారణకు వస్తే చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవనే అనుకోవాలి. ఎందుకంటే, సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నాయి. సరిగ్గా ఎన్నికలకు ముందు అవినీతిపై విచారణ, కోర్టు కేసులు అంటే ఎవరికైనా ఇబ్బందులే అన్న విషయం గమనించాలి. కాకపోతే తనపై కేసులు పడితే దాన్ని కూడా చంద్రబాబు సానుభూతి కోసం ఉపయోగించుకుంటారేమోనని బిజెపి నేతలు ఆలోచిస్తున్నారు.