వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడు రికార్డును బద్దలు చేయాలని అనుకుంటున్నారు. ఇంతకీ అదేమిటంటే, కడప జిల్లాలోని 10 సీట్లలో మెజారిటీ స్ధానాల్లో పార్టీ జెండాను ఎగరేయటమే కాకుండా పులివెందులలో జగన్మోహన్ రెడ్డిని ఓడించటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగానే వ్యాహాలు రచిస్తున్నారు. ఇంతకీ చంద్రబాబు తన లక్ష్యాన్ని చేరుకోగలరా ? అన్నదే జిల్లా పార్టీలో ఇపుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒకేసారి రెండు లక్ష్యాలను నిర్దేశించుకోవటంతో పార్టీ నేతలు చాలా ఇబ్బందలు పడుతున్నారు. ఎందుకంటే, లక్ష్యాలను చంద్రబాబే నిర్దేశించినా క్షేత్రస్ధాయిలో అమలు చేయాల్సింది జిల్లాలోని నేతలే. ఇక్కడే అసలు సమస్యలు ఎదురువుతున్నాయి.
కడప అంటేనే వైఎస్ కుటుంబం
కడప జిల్లా అంటే వైఎస్ జిల్లాగా దశాబ్దాల తరబడి పేరు పడిపోయింది. జిల్లాలోని మెజారిటీ స్ధానాల్లో వైఎస్ కుటుంబం ప్రాబల్యమే కనబడుతుంది. అందులోనూ పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ కుటుంబం గెలవటమన్నది ఓ సెంటిమెంటుగా మారిపోయింది. గ్రామస్ధాయిలోని సర్పంచ్ పదవి నుండి ముఖ్యమంత్రి వరకూ వైఎస్ కుటుంబం చూడని పదవి లేదు. నామినేషన్ వేస్తే చాలు వైఎస్ కుటుంబం గెలవటమే. నామినేషన్ వేసిన ప్రతీసారి అపజయం అన్నది లేకుండా సాగిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రస్ధానం ఓ రికార్డనే చెప్పాలి.
వైఎస్ మరణంతో మారిపోయిన తలరాత
సరే, రెండోసారి ముఖ్యమంత్రి కాగానే వైఎస్ మరణించటమన్నది హఠాత్ పరిణామం. వైఎస్ మరణంతో రాష్ట్ర తలరాతే మారిపోయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేసి వైఎస్సార్ సిపి ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో జరిగిన ఎన్నికల్లో కడప జిల్లాలో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే టిడిపి గెలిచింది. మిగిలిన అన్నీ నియోజకవర్గాల్లో వైసిపి అభ్యర్ధులే గెలిచారు. అయితే, వచ్చే ఎన్నికల్లో సీన్ రివర్స్ చేయాలన్నది చంద్రబాబు లక్ష్యం.
వైసిపిని బలహీనం చేసేందుకు వ్యూహాలు
లక్ష్యాన్ని చేరుకోవటంలో భాగంగా చంద్రబాబు ముందు వైసిపిని బలహీనం చేసేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగానే ఫిరాయింపులను ప్రోత్సహించారు. చంద్రబాబు వేసిన గాలానికి జమ్మలమడుగు, బద్వేలు ఎంఎల్ఏలు ఆదినారాయణరెడ్డి, జయరాములు తగులుకున్నారు. దాంతో ఫిరాయింపులను ప్రోత్సహించి వారిద్దరినీ టిడిపిలోకి లాక్కోవటమే కాకుండా ఆదికి మంత్రిపదవి కూడా కట్టబెట్టారు. అప్పటి నుండి ఫిరాయింపు మంత్రి రెచ్చిపోతున్నారు. ఆమధ్య జరిగిన స్ధానిక సంస్దల ఎంఎల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డిని ఓడించటమే పెద్ద రికార్డు. అందుకు చంద్రబాబు తొక్కని అడ్డదారులు లేవన్న విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుండి చంద్రబాబు జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. ముందుగా వైసిపి నేతలను బలహీనపరుస్తున్నారు. ఈ మధ్య జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దదండ్లూరు గ్రామంలో జరిగిన దాదులే అందుకు ఉదాహరణ.
తాగు, సాగు నీరు గట్టెక్కిస్తుందా ?
అదే సందర్భంలో దశాబ్దాల తరబడి సాగు, తాగు నీటికి ఇబ్బంది పడుతున్న ప్రాంతాలకు గండికోట రిజర్వాయర్ ద్వారా చంద్రబాబు నీరందించారు. నిజానికి ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో చాల వరకూ వైఎస్ హయాంలోనే పూర్తయ్యాయి. మిగిలిన అరా కొరా పనులను పూర్తిచేసేందుకు చంద్రబాబుకు నాలుగేళ్ళుపట్టింది. తాగు, సాగు నీరందిన ప్రాంతాల్లో పులివెందుల కూడ ఉంది. వచ్చే ఎన్నికల్లో పులివెందులలో టిడిపి జెండా ఎగరేయాలన్నది చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. పులివెందులలో జగన్ ను ఓడించగలిగితే జిల్లాలోని మెజారిటీ స్ధానాలు టిడిపి ఈజీగా గెలుచుకోగలదన్నది చంద్రబాబు ప్లాన్ గా కనబడుతోంది. అందుకు తొందరలో ప్రత్యేకంగా ఓ యాక్షన్ టీంనే ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. క్షేత్రస్ధాయిలో పరిస్దితులు చూస్తుంటే చంద్రబాబు ప్లాన్ వర్కవుట్ అవుతుందా లేక రివర్స్ అవుతుందో చూడాల్సిందే ?