రానున్న ఎన్నికల్లోపార్లమెంటుకు పోటీ చేయాలంటేనే నేతలు భయపడిపోతున్నారు. వైసిపి, భారతీయ జనతా పార్టీ, జనసేన నేతల సంగతి పక్కనపెడితే తెలుగుదేశం పార్టీ నేతల్లో మాత్రం భయం స్పష్టంగా కనబడుతోంది. ఇంతకీ వారు ఎందుకు అంత భయపడుతున్నారంటే ఖర్చులకు భయపడేనట. పోయిన ఎన్నికల్లోనే ఎంపిలు గా పోటీ చేసిన వారిలో అత్యధికుల చేతి చమురు బాగానే వదిలింది. ఇక, వచ్చే ఎన్నికల్లో పోటీ అంటే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. అందుకనే ఎంపిగా పోటీ చేయటంకన్నా ఎంఎల్ఏగా పోటీ చేయటమో లేకపోతే గ్యారెంటీ గెలుపు అయితే ఎంఎల్సీగా పోటీ చేయటమో మేలని పలువురు భావిస్తున్నారట. రాష్ట్ర విభజన నేపధ్యంలో, భావోద్వేగాల మధ్య జరిగిన ఎన్నికల్లోనే ఎంపి అభ్యర్ధులకు భారీగా ఖర్చైంది. ఇక, రాబోయే ఎన్నికల్లో గెలవటం ఇటు చంద్రబాబునాయుడుతో పాటు అటు వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా చావో రేవో అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే మళ్ళీ అధికారంలోకి రావాలని చంద్రబాబు, ఎలాగైనా అధికారం అందుకోవాలని జగన్ చేస్తున్న ప్రయత్నాలను అందరూ చూస్తున్నదే. అంతటి ప్రతిష్టాత్మకమైన ఎన్నికల్లో ఖర్చు ఏ స్ధాయిలో ఉంటుందో నేతలు ఊహించలేకున్నారు.
ప్రభుత్వంపై వ్యతిరేకత
ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో అధికార తెలుగుదేశంపార్టీ పై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోందనే ప్రచారం బాగా వినబడుతోంది. కేంద్రం నుండి రాబట్టాల్సిన విభజన హామీలను రాబట్టటంలో చంద్రబాబు విఫలమయ్యారు. అదే సమయంలో రాష్ట్రంలో కూడా పాలన సమస్తమూ అవినీతిమయమైపోయింది. శాంతి, భద్రతల విషయాన్ని ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక సంక్షేమ పథకాలు కూడా అర్హులకు పూర్తిగా అందటం లేదనే ఆరోపణలు ఎక్కువైపోయాయి. జనాల్లో పెరిగిపోతున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని టిడిపి నేతలు ఎంపిలుగా పోటీ చేయటానికి వెనకాడుతున్నట్లు సమాచారం.
జగన్ పాదయాత్ర జోరు
చంద్రబాబు వైఫల్యాలపై వైసిపి అధ్యక్షుడు జగన్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. చంద్రబాబుపై ఒత్తిడి పెంచటంలో భాగంగానే 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర మొదలుపెట్టారు. ఇప్పటికి 2300 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకూ జగన్ పాదయాత్ర చేసిన జిల్లాల్లో జనాలు బ్రహ్మరథం పట్టటంతో టిడిపి నేతల్లో ఆందోళనలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వంపై జనాల్లోని వ్యతిరేకతను గమనించిన పలువురు టిడిపి నేతలు వివిధ జిల్లాల్లో వైసిపిలో చేరుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దాంతో టిడిపి ప్రజాప్రతినిధుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.
గెలుపుపై నమ్మకం లేకేనా ?
ఇటువంటి నేపధ్యంలోనే పలువురు ఎంపిలు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయటానికి వెనకాడుతున్నారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి ఎంపి ముత్తంశెట్టి శ్రీనివాస్, తూర్పు గోదావరి జిల్లా ఎంపి తోట నర్సింహం వచ్చే ఎన్నికల్లో ఎంపిలుగా పోటీ చేసేదిలేదని చంద్రబాబుకు ఇప్పటికే చెప్పేశారట. వారిబాటలోనే ఇంకా పలువురు ఎంపిలున్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. పోయిన ఎన్నికల్లోనే పలువురు ఎంపిలకు సుమారుగా రూ. 80 కోట్లు ఖర్చైనట్లు సమాచారం. ప్రతిష్టాత్మకంగా జరగబోయే వచ్చే ఎన్నికల్లో ఖర్చు గురించి తలుచుకుని నేతలు వణికిపోతున్నారట. దానికితోడు ఎంత ఖర్చు పెట్టినా గెలుపుపై నమ్మకం కూడా లేకపోవటంతో ఎంపిలుగా కన్నా ఎంఎల్ఏలుగా పోటీ చేయటమే మేలని డిసైడ్ అయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయ్.