విభజన హామీలు ఒక్కొక్కటి అటకెక్కుతోంది. తాజాగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటును కూడా కేంద్రప్రభుత్వం అటకెక్కించేసింది. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టే విషయం తమ పరిశీలనలో లేదని స్పష్టం చేసింది. దాంతో రాష్ట్రానికి షాక్ కొట్టినట్లైంది. కడపలో ఉక్కు ఫ్యాక్టీరీ పెట్టాలన్నది రాష్ట్రాన్ని విభజించేటపుడు అప్పటి యుపిఏ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒకటన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ లాంటి కీలకమైన హమీలను కేంద్రం గాలికొదిలేసింది. తాజాగా ఆ జాబితాలో ఉక్కు ఫ్యాక్టరీ కూడా చేరింది.
రాష్ట్రం ఆశలపై నీళ్ళు
ఉక్కు ఫ్యాక్టీరీకి సంబంధించిన సమీక్షలో పాల్గొనాల్సిందిగా కేంద్ర నుండి పిలుపు రావటంతో వెంటనే తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు ఢిల్లీకి వెళ్ళారు. కేంద్ర గనుల శాఖ సంయక్త కార్యదర్శితో సమావేశం సందర్భంగా ఉన్నతాధికారులకు తీవ్ర నిరాసే ఎదురైంది. ఎందుకంటే, తాను కొత్తగా బాధ్యతలు తీసుకున్న కారణంగా వివరాలు తెలుసుకునేందుకు మాత్రమే సమావేశం ఏర్పాటు చేసినట్లు సంయుక్త కార్యదర్శి చల్లగా చెప్పారు.
ఏపికి తెలంగాణాకు లింకు ఏంటి ?
కడపలో స్టీల్ ఏర్పాటుకు, తెలంగాణా రాష్ట్రంతో లింక్ పెట్టడాన్ని ఏపి ఉన్నతాధికారులు విస్తుపోతున్నారు. ఏపిలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు, తెలంగాణా రాష్ట్రానికి సంబంధం ఏంటంటూ మండిపోతున్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటులో తెలంగాణా నుండి నివేదిక రాలేదంటూ ఏపిలో ఫ్యాక్టీరీ ఏర్పాటు విషయాన్ని కూడా కేంద్రం పక్కన పెడుతోంది. అదే సందర్భంలో ఏపిలో ఉన్న ఇనుప ఖనిజాలపై రెండు రకాల ప్రచారం జరుగుతోంది. కడపలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు సరిపడా గనులు అందుబాటులో ఉందన్నది మొదటి ప్రచారం. అయితే, గనుల్లో ఉన్న ఇనుప ఖనిజం అంత నాణ్యమైనది కాదన్నది రెండో ప్రచారం. రెండింటిలో ఏది నిజమో తేల్చాల్సిన కేంద్రం ఉద్దేశ్యపూర్వకంగానే తొక్కిపెడుతోంది.