కరెక్టుగా చెప్పాలంటే జనసేన పార్టీకి ఇంకా సరైన పునాదే వేయలేదు. పునాదిరాయి ఎప్పుడు పడుతుందో కూడా తెలీదు. అంతలోనే అంతర్గతంగా గొడవలు మొదలయ్యాయి. గొడవలెందుకంటే ? ఎన్నికలు సమీపిస్తున్నాయి కదా పార్టీలో ఆధిపత్యం ఎవరిదనే వివాదాలు మొదలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, కాకినాడలో ఇప్పటికే ఆధిపత్య గొడవులు రోడ్డున పడితే తాజాగా తిరుపతిలో కూడా నేతలు రెడెక్కారు. పార్టీ కార్యక్రమాలకు అధినేత పవన్ కల్యాణ్ నియోజకవర్గాల వారీగా పరిశీలకులను నియమించారు. ఆమధ్య గుంటూరులో జరిగిన పార్టీ ఆవిర్భవ సదస్సుకు ముందే పరిశీలకులను పవన్ నియమించారు. అయితే, కొందరు కష్టపడి పని చేస్తుంటే మరికొందరు కేవలం షో చేస్తు కాలం గడిపేస్తున్నారు. దాంతో రెండు వర్గాల మధ్యా గొడవలు మొదలయ్యాయి. ఆ పంచాయితీలే చివరకు పవన్ ముందుకు చేరుకుంటున్నాయి.
ఫ్యాన్స్ సభ్యులే జనసేన సభ్యులా ?
గ్రామాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని పవన్ పిలుపిస్తే పెద్దగా స్పందన రాలేదని సమాచారం. ఇప్పటికి సుమారు 15 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయని పార్టీ నేతలు చెబుతున్నా అదంతా ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యత్వాలే అని సమాచారం. చిరంజీవి, బన్నీ, రాంచరణ్, వరుణ తేజ ఇలా మొత్తం మెగా ఫ్యామిలీ హీరోల అభిమాన సంఘాల సభ్యత్వాలనే జనసేన నేతలు పార్టీ సభ్యత్వాలుగా చూపిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈనెల 7వ తేదీన రాజమండ్రిలో పరిశీలకుని ఆద్వర్యంలో సభ్యత్వ నమోదు, బూత్ కమిటీల ఏర్పాటు పై ఓ కార్యక్రమం పెడితే అదికాస్త రాసాబాస అయ్యింది. జిల్లా కన్వీనర్ గా ఉన్న మారిశెట్టి రాఘవయ్యను చివరి నిముషంలో మార్చేసి పార్టీలో కొత్తగా చేరిన అద్దేపల్లి శ్రీధర్ ను నియమించారు. దాంతో రాజమండ్రిలో గొడవలు జరుగుతోంది.
చాలా చోట్ల ఆధిపత్య గొడవలే
అదేపద్దతిలో తిరుపతిలో కూడా మరో పంచాయితీ పవన్ ముందుకు వచ్చింది. అభిమాన సంఘాల వారికి, పార్టీ నేతలకు మధ్య పంచాయితీ మొదలైంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య వ్యక్తిగత విభేదాలు బయటపడ్డాయి. జనసేనకు చెందిన కిరణ్ రాయల్ తనపై దాడి చేశారంటూ చిత్తూరు జిల్లా పవన్ అభిమానుల సంఘం అధ్యక్షుడు పసుపులేటి సురేష్ ఈస్ట్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. తిరుపతి గురవారెడ్డి సమాధుల వద్ద తనపై నలుగురుతో కలసి కిరణ్ రాయల్ దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. కాగా జనసేన పార్టీలో ఎలాంటి పదవులు లేవని పార్టీని అడ్డం పెట్టుకుని కిరణ్ రాయల్ తనపై దాడి చేశారని పసుపులేటి సురేష్ మీడియా ముందు వాపోయాడు. ఈ గొడవలు ఒక్క రాజమండ్రికో లేకపోతే తిరుపతికి మాత్రమే పరిమితం కాలేదు. చాలా నియోజకవర్గాల్లో ఇటువంటి గొడవలే తరచూ జరుగుతున్నాయని పార్టీ వర్గాల సమాచారం. కాకపోతే ఇంకా అవి రోడ్డున పడలేదు. ఇదేపంచాయితీని పవన్ ముందుకు సురేష్ తీసుకొస్తున్నారు.
పవన్ తప్ప మరో నేతే కనబడరు
పార్టీ పెట్టి ఐదేళ్ళవుతున్నా ఇంకా జనసేనకు రంగు, రుచి, వాసన మొత్తం పవన్ కల్యాణే అనటంలో సందేహం లేదు. పిరమిడ్ పద్దతిలో పార్టీ యంత్రాంగాన్ని నిర్మించాల్సిన పవన్ ఎందుకనో ఆ దిశగా ఆలోచించలేదు. గ్రామస్ధాయి నుండి కమిటీలతో మొదలు పెట్టి రాష్ట్ర అధ్యక్షుని నియామకం వరకూ ఓ పద్దతిగా జరగాలి. అటువంటిది ఇంత వరకూ ఏ ప్రయత్నమూ జరగలేదు. పవన్ నియమించిన ఓ పదిమంది తప్ప ఇంకెవరూ జనసేనలో లేరు. ఉన్నవారికి కూడా జనబలం ఉందో లేదో కూడా తెలీదు. ఎందుకంటే, వారెవరూ జనాల్లో నుండి వచ్చిన నేతలు కారు. కేవలం పవన్ తో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా మీడియాకు ప్రకటనలు పంపటానికి మాత్రమే పదవుల్లో ఉన్నట్లున్నారు. మరి, కమిటీలు ఎప్పుడేస్తారో ? సభ్యత్వ నమోదు ఎప్పుడు పూర్తవుతాయో ? అభ్యర్ధులను ఎప్పుడు ఎంపిక చేస్తారో ? అంతా గందరగోళంగా కనబడుతోంది.