ఎన్నికలు దగ్గరపడే కొద్దీ రాష్ట్రంలోని రెండు ప్రధానమైన సామాజికవర్గాలు చంద్రబాబునాయుడుకు దూరమయ్యే సూచనలు స్పష్టంగా కనబడుతోంది. పోయిన ఎన్నికల్లో ఏ సామాజికవర్గాల మద్దతుతో అధికారంలోకి వచ్చారో అవే సామాజికవర్గాలు నాలుగేళ్ళల్లోనే చంద్రబాబుకు దూరమవుతున్నాయి. ఇంతకీ ఆ సామాజికవర్గాలేంటా అని ఆలోచిస్తున్నారా ? అవేలేండి కాపులు, బిసిలు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెండు సామాజికవర్గాలు కూడా ఒకే హామీ విషయంలో చంద్రబాబుకు దూరమవుతుండటం విచిత్రం.
షార్ట్ టర్మ్ బెనిఫిట్ పైనే ఆలోచన
విషయంలోకి వస్తే పోయిన ఎన్నికల్లో అధికారం అందుకోవటమే లక్ష్యంగా చంద్రబాబు బిజెపి, పవన్ కల్యాణ్ తో పొత్తులు పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. వాటితో పొత్తుపెట్టుకున్నా అధికారంలోకి వస్తామన్న నమ్మకం కుదిరినట్లు లేదు. ఆచరణ సాధ్యం కాని పలు హామీల్లాగే కాపులను బిసిల్లోకి చేరుస్తామన్న హామీ కూడా ఇచ్చారు. సమస్య అక్కడే మొదలైంది. చంద్రబాబుది ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ బెనిఫిట్టే. అందుకనే పోయిన ఎన్నికల్లో గట్టెక్కటం వరకే ఆలోచించారు. కాపులను బిసిల్లోకి చేర్చలేకపోతే అదే సామాజికవర్గం వచ్చే ఎన్నికలకు దూరమవుతుందన్న ఆలోచన చేసినట్లు లేరు. లేదా వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఏదో మాయ చేద్దామని అనుకున్నారో అర్ధం కావటం లేదు.
తన హామీ చంద్రబాబుకే చుట్టుకుంది
2014 ఎన్నికల్లో కాపులకు ఇచ్చిన హామీనే ఇపుడు సమస్యగా మారింది. అధికారంలోకి రాగానే కాపులకిచ్చిన హామీని పక్కనపెట్టేశారు. దాంతో ఏడాది వెయిట్ చేసిన తర్వాత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆందోళన మొదలుపెట్టటం, అదికాస్త పెరిగిపెద్దదైపోయి చివరకు చంద్రబాబుకే చుట్టుకోవటం అందరికీ తెలిసిందే. ఆ సమస్యలో నుండి బయటపడేందుకు ఏదో తూతూ మంత్రంగా ఓ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపేసి చేతులు దులుపుకున్నారు.
చంద్రబాబు హామీకి వ్యతిరేకంగా ఉద్యమం
విచిత్రమేమిటంటే, కాపులకు 2014 ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చినపుడు ఏమీ మాట్లాడని బిసి సామాజికవర్గం నేతలు ఏడాది నుండి గోల మొదలుపెట్టారు. కాపులు అన్నీ రంగాల్లోనూ అభివృద్ధి చెందారన్నది బిసి నేతల వాదన. అటువంటి వారిని బిసిల్లోకి చేరిస్తే ఇప్పటి వరకూ తమకు దక్కుతున్న రిజర్వేషన్ ఫలాలను కాపులే ఎగరేసుకుపోతారని బిసి నేతలంటున్నారు. కాపు రిజర్వేషన్ ను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కూడా చేశారు. తమను బిసిల్లో చేర్చలేదని కాపులు, కాపులకు రిజర్వేషన్ కల్పిస్తే ఒప్పుకోమంటూ బిసిలు చంద్రబాబుపై మండిపడుతున్నారు. పార్టీ పెట్టినప్పటి నుండి గడచిన 30 ఏళ్ళల్లో బిసిలు ఎన్నడూ టిడిపికి దూరం కాలేదు. చంద్రబాబు పుణ్యమా అంటూ వచ్చే ఎన్నికల్లో బిసిలు దూరమవుతున్నారు. రెండు ప్రధానమైన సామాజికవర్గాల జనాభానే రాష్ట్రంలో సుమారు 70 శాతందాకా ఉన్న విషయం తెలిసిందే. అటువంటి సామాజికవర్గాల్లో తక్కువలో తక్కువ సగం దూరమైనా చంద్రబాబుకు పెద్ద దెబ్బే అనుకోవాలి. చంద్రబాబుకు దూరమయ్యే సామాజికవర్గాలు మరి ఎవరికి దగ్గరవుతారు ? ఆ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.
రెండు సామాజికవర్గాలదే ప్రధాన పాత్ర
ఎందుకంటే, కాపుల సామాజికవర్గం మద్దతుపైనే జనసేన ఆధారపడుంది. అదే సామాజికవర్గం మద్దతు కోసం వైసిపి, బిజెపిలు ప్రయత్నాలు చేసుకుంటున్నాయి. అదే సమయంలో చంద్రబాబుపై మండుతున్న బిసిలు ఏ పార్టీకి మద్దతు ఇస్తారనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. ఏదేమైనా పై రెండు సామాజికవర్గాల మద్దతు లేకుండా ఏ పార్టీ కూడా అధికారంలోకి రావటం కష్టమన్నదాంట్లో ఎటువంటి సందేహం లేదు.