కడప జిల్లాకు రావాల్సిన స్టీల్ ఫ్యాక్టరీ కోసం వైసిపి ఉక్కు పోరాటం చేయాలని నిర్ణయించింది. జిల్లాలో దశలవారీగా ఆందోళన కార్యక్రమాలకు శుక్రవారం నిర్ణయమైంది. పార్టీ అధ్యక్షతన కడపలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈనెల 24వ తేదీ నుండి దశలవారీగా మూడు రోజుల పాటు జిల్లా అంతటా దీక్షలు చేయాలని సమావేశం నిర్ణయించింది. అలాగే 27వ తేదీన జాతీయ రహదారులను దిగ్భందం చేయాలని, 29వ తేదీన జిల్లా బంద్ పాటించాలని పార్టీలన్నీ నిర్ణయించాయి. ఈరోజు జరిగిన అఖిలపార్టీ సమావేశానికి కాంగ్రెస్, వామపక్షాలు, జనసేనతో పాటు ప్రజాసంఘాలు కూడా పాల్గొన్నాయి.
ఎన్నికల్లో ప్రధాన అంశం ఇదేనా ?
చూడబోతే రాబోయే ఎన్నికల్లో కడప జిల్లా వరకూ ఉక్కు ఫ్యాక్టీరీ ఏర్పాటే ప్రధాన అంశం అయ్యేట్లు కనబడుతోంది. మొన్నటి వరకూ తెలుగుదేశంపార్టీ ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోలదన్న విషయం అందరకీ తెలిసిందే. ఎప్పుడైతే ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేశారో అప్పటి నుండో చంద్రబాబునాయుడుకు ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వేజోన్ తో పాటు కడపజిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ కూడా గుర్తుకు వచ్చింది. ఫ్యాక్టరీని ఎటూ కేంద్రం మంజూరు చేయదన్న నిర్ణయానికి వచ్చిన తర్వాతే టిడిపి స్టీల్ ఫ్యాక్టరీ గురించి ప్రస్తావన మొదలుపెట్టింది.అదే సమయంలో వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రె్డ్డి సందర్భం వచ్చినపుడల్లా ఉక్కు ఫ్యాక్టరీ గురించి డిమాండ్ చేస్తునే ఉన్నారు. జిల్లాలోని విద్యా సంస్ధల తరపున విద్యార్ధులందరూ చాలా సార్లు ఫ్యాక్టరీ కోసం సదస్సులు నిర్వహించారు. అంతేకాకుండా ఫ్యాక్టరీ కోసం ఆందోళనలతో పాటు దీక్షలు కూడా చేసిన సంగతి తెలిసిందే.
బిజెపి-టిడిపిల్లో ఎవరిది తప్పు ?
రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విభజన చట్టంలోని హామీలపై ప్రతిపక్షాలతో పాటు అధికార టిడిపి కూడా కేంద్రప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఇటువంటి నేపధ్యంలోనే కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రప్రభుత్వం చెప్పినట్లు రాష్ట్రానికి సమాచారం వచ్చింది. ఆ సమాచారం ఆధారంగా కేంద్రానికి వ్యతిరేకంగా టిడిపి పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు మొదలుపెట్టింది. అయితే, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, అసలు కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి లేఖ రాసినట్లు పెద్ద బాంబు పేల్చారు. దాంతో విషయం కాస్త బిజెపి-టిడిపి మధ్య గొడవగా మారింది.
ఫ్యాక్టరీ కోసం వైసిపి ఐక్య పోరాటాలు
ఇటువంటి నేపధ్యంలోనే వైసిపి లీడ్ రోల్ తీసుకుంది. ఉక్కు ఫ్యాక్టరీ కోసం జిల్లాలోని రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఫ్యాక్టరీ సాధన కోసం దశలవారీగా ఆందోళన కార్యక్రమాలను ప్రకటించింది. వైసిపి మాత్రమే ఆందోళనలు చేస్తే ఉపయోగం ఉండదని భావించే కలసివచ్చే పార్టీలను కూడా కలుపుకున్నది. దాంతో ఆందోళన తీవ్రరూపం దాల్చే అవకాశాలున్నట్లు స్పష్టమవుతోంది.