చంద్రబాబునాయుడు సొంత పార్టీలో కూడా విభజించుపాలించు సూత్రం పాటిస్తున్నారు. తన సహజ ధోరణిలో నేతల మధ్యే కాదు ప్రాంతాల మధ్య కూడా చిచ్చు పెడుతున్నారు. తాజాగా పార్టీలో జరిగిన రెండు సంఘటనలను పరిశీలిస్తే ఆ విషయం స్పష్టంగా అర్ధమైపోతుంది. తాజాగా సిఎం రమేష్ వ్యవహారంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుతో పలువురు నేతలు విస్తుపోతున్నారు.
చంద్రబాబు వైఖరిపై నేతల్లో విస్మయం
తాజాగా కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయం రాష్ట్రంలో రాజకీయపార్టీల మధ్య పెద్ద దుమారాన్నే రేపుతున్న సంగతి అందరూ చూస్తున్నదే. ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించటం లేదని చంద్రబాబుతో పాటు పలువురు టిడిపి నేతలు మండిపడుతున్నారు. అదే సమయంలో కడప ఫ్యాక్టరీ విషయంలో రాష్ట్రప్రభుత్వమే వీలుకాదన్నదని బిజెపి నేతలు ఎదురుడాడి చేస్తున్నారు. వీరి విషయం ఇలావుండగా జిల్లా వ్యాప్తంగా ఫ్యాక్టరీ కోసమని వైసిపి ఆందోళనలు చేస్తోంది.
ఎంపిలందరూ సిఎం రమేష్ కు మద్దతివ్వాలట
ఫ్యాక్టరీ అంశాన్నే ఎంపిలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, ఉక్కు ఫ్యాక్టరీ కోసం రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ చేయబోతున్న దీక్షకు అందరు ఎంపిలు సంఘీభావం తెలపాలంటూ ఆదేశించారు. దీక్ష రోజున ఎంపిలందరూ కడపకు వెళ్ళి మద్దతు తెలపాలని చెప్పారు. ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో కేంద్రప్రభుత్వం వైఖరిని ప్రజలందరికీ ఎంపిలు వారి నియోజకవర్గాల్లో వివరించాలంటూ గట్టిగా చెప్పారు. ఇంత వరకూ బాగానే ఉంది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్ర వైఖరిని ఎండగట్టాల్సిందే. అందులో ఎవరూ రాజీపడాల్సిన అవసరం లేదు. కాబట్టి చంద్రబాబును తప్పు పట్టాల్సిన అవసరం కూడా ఏమీ లేదు.
అవంటిని పట్టించుకోని చంద్రబాబు
మరి, ఇదే పద్దతి విశాఖపట్నం జిల్లా అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివాస్ విషయంలో ఏమైందన్నదే ప్రశ్న. విభజన చట్టంలో ఉన్న విశాఖపట్నం ప్రత్యేక రైల్వేజోన్ అంశాన్ని కూడా కేంద్రం పట్టించుకోవటం లేదు. రైల్వేజోన్ అంశం మీద కూడా కేంద్రం ఎన్ని పిల్లిమొగ్గలు వేస్తోందో అందరూ చూస్తున్నదే. అటువంటి అంశంపై అవంటి శ్రీనివాస్ మొన్ననే తన నియోజకవర్గ కేంద్రంలో దీక్ష చేశారు. అయితే, ఆ దీక్షను చంద్రబాబుతో సహా ఎవ్వరూ పట్టించుకోలేదు. పైగా పార్టీ లైన్ కు విరుద్ధంగా అవంతి దీక్ష చేయటంతో తమకు ఇబ్బందులు వస్తాయంటూ పలువురు నేతలు చంద్రబాబుతో ఫిర్యాదు కూడా చేశారు. దీన్ని బట్టే తెలుస్తోంది నేతల మధ్య చంద్రబాబు ఏ విధంగా విభజించుపాలించు సూత్రాన్ని పాటిస్తున్నారో ?