తెలుగుదేశంపార్టీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఈనెల 20వ తేదీ నుండి ఆమరణ దీక్షకు కూర్చోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకోసం జిల్లా పరిషత్ కార్యాలయం ప్రాంగణాన్ని వేదికగా ఎంపిక చేసుకున్నారు. దీక్ష వేదిక ఏర్పాట్లకు చురుగ్గా పనులు మొదలైనట్లు సమాచారం. వేదికలో వాడే విద్యుత్ కోసం ప్రత్యేకంగా విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేయాలంటూ రమేష్ విద్యుత్ శాఖకు దరఖాస్తు పెట్టుకున్నారట. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండానే జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణాన్ని ఎంపిక చేసుకున్నట్లు టిడిపి నేతలు చెబుతున్నారు. దీక్షకు కూర్చునే రోజున టిడిపి నేతలు ఎలాగూ పెద్ద ఎత్తున హాజరవుతారన్న విషయం అందరికీ తెలిసిందే. పనిలో పనిగా ఇతర పార్టీల నేతలను కూడా రమేష్ ఆహ్వానించారట.
ఎందుకింత హడావుడి చేస్తున్నారు ?
అంతా బాగనే ఉంది. కానీ, అధికార పార్టీలో జిల్లాలో అంతమంది నేతలుండగా ఒక్క రమేష్ మాత్రమే ఆమరణ దీక్షకు ఎందుకు దిగుతున్నారు ? పోనీ రమేష్ ఏమన్నా ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం మొదటి నుండి పోరాడుతున్నారా అంటె అదీ లేదు. ఏదో సందర్భం వచ్చినపుడు మాత్రమే తూతూ మంత్రంగా మాట్లాడేవారు. అటువంటి రమేష్ హటాత్తుగా ఆమరణదీక్ష అనే బ్రహ్మాస్త్రం లాంటి ఆందోళన పద్దతిని ఎందుకు నిర్ణయం తీసుకున్నారో ?
జిల్లాలో పరిస్ధితి అంతంత మాత్రమేనా ?
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే రాజకీయంగా రమేష్ పరిస్దితి ఏమంత కంఫర్టబుల్ గా లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఆర్ధికంగా బాగా స్ధితిమంతుడు కాబట్టి చంద్రబాబుతో మాత్రం మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ అదే సమయంలో జిల్లాలోని నేతల్లో చాలామందితో పడటం లేదు. ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డితో పడదు. అదే సమయంలో సీనియర్ నేత, ఎంఎల్సీ రామసుబ్బారెడ్డితో సంబంధాలు ఉప్పు-నిప్పులాగుంది. ప్రొద్దుటూరు మాజీ ఎంఎల్ఏ వరదరాజులరెడ్డితో ఏమాత్రం పడటం లేదు. అదే సమయంలో కమలాపురం మాజీ ఎంఎల్ఏ వీరశివారెడ్డితో సంబంధాలు కూడా అంతంత మాత్రమే.
జిల్లాలో ఎటుచూసినా ప్రత్యర్ధులే
ఇటువంటి పరిస్ధితుల్లో రమేష్ జిల్లాలో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. పైన చెప్పుకున్న నేతలందరూ క్షేత్రస్ధాయిలో సామాన్య జనాలతో కానీ పార్టీ క్యాడర్ తో కాని సంవత్సరాల నుండి మంచి సంబంధాలున్న వాళ్ళే. దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలుతిని రాటుదేలిపోయిన వాళ్ళే. అటువంటి నేతల మధ్య రమేష్ పై నుండి ఊడిపడిన వాడు.తన వద్ద ఉన్న డబ్బుతో పై స్ధాయిలో వాళ్ళను మంచి చేసుకుని రెండుసార్లు రాజ్యసభకు నామినేట్ అయిన విషయం గుర్తుంచుకోవాలి. చంద్రబాబుతో మంచి సంబంధాలుంది కాబట్టి పైన చెప్పిన నేతలను ఏమాత్రం పట్టించుకోవటం లేదు. అందుకనే వాళ్ళకు రమేష్ కు తరచూ గొడవలవుతున్నాయి.
సొంత వర్గం ఏర్పాటుకు ప్రయత్నాలు
ఎటూ ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో తనకంటూ ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకోకపోతే రాజకీయంగా మనుగడ కష్టమని రమేష్ గ్రహించినట్లున్నారు. అందుకనే ప్రొద్దుటూరు, కమలాపురం, జమ్మలమడుగు, కడప, బద్వేలు, రాజంపేట నియోజకవర్గాల్లో కొందరు నేతలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కోసం ప్రయత్నిస్తున్నట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. మిగిలిన నేతల మాటను కాదని చంద్రబాబు తన మాట ప్రకారం టిక్కెట్లు కేటాయించాలంటే ఏదో ఓ సంచలనం జరగాల్సిందే. హటాత్తుగా ఉక్కు ఫ్యాక్టరీ రూపంలో అవకాశం వచ్చింది. అందుకనే వెంటనే రమేష్ కార్యాచరణలోకి దిగేశారు. ఫ్యాక్టరీ కోసం ఆమరణ దీక్ష అంటూ హడావుడి చేస్తున్నారు. మరి, రమేష్ వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.