ఫెడరల్ ఫ్రంట్ ను పట్టాలెక్కిస్తానంటూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. దేశాన్ని 60 ఏళ్లకు పైగా పరిపాలించిన కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమవ్వాల్సిన అవసరాన్ని ఆయన చాటిచెప్పారు. ఇందుకోసం తనవంతు ప్రయత్నం చేస్తున్నానని, ఇక తెలంగాణను వదిలేసి దేశ రాజకీయాల్లోకి వెళ్తానని బహిరంగ ప్రకటన చేశారు. మరి ఇప్పుడు ఆయన స్ట్రాటజీ ఏంటి?
యూపీఏ, ఎన్డీయేలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ను తెరపైకి తీసుకొచ్చారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. 60 ఏళ్లకు పైగా దేశాన్ని ఏలిన కాంగ్రెస్, బీజేపీల పాలనలో ఏమాత్రం అభివృద్ధి చెందలేదని దుమ్మెత్తిపోశారు. అందుకే వారికి చరమగీతం పాడి.. మిగిలినపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. దేశమంతా తిరిగి ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేస్తానని ప్రతినపూనారు. ఇందుకు తగ్గట్టే తృణమూల్ అధినేత మమత బెనర్జీని కోల్ కతా వెళ్లి కలిసొచ్చారు. చెన్నై వెళ్లి డీఎంకే అధినేత కరుణానిధితో సమావేశమయ్యారు. బెంగళూరు వెళ్లి జేడీఎస్ అధినేత దేవెగౌడతో భేటీ అయ్యారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ను హైదరాబాద్ పిలిపించుకుని మాట్లాడారు.
ఫెడరల్ ఫ్రంట్ స్థాపించాలన్న కేసీఆర్ నిర్ణయంతో ఎవరూ విభేదించలేదు పైగా వీళ్లంతా స్వాగతించినవారే. అయితే కేసీఆర్ ఫ్రంట్ అనగానే దానిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. బీజేపీకి లబ్ది చేకూర్చేందుకే కేసీఆర్ ఈ ఫ్రంట్ డ్రామాలాడుతున్నారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దీనిపై పలు సన్నివేశాలను వాళ్లు ఉటంకిస్తున్నారు. కేసీఆర్ కోల్ కతా వెళ్లి మమతతో భేటీ అయినప్పుడు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై గొడవ జరుగుతోంది. ఆ సమయంలో అవిశ్వాస తీర్మానంపై చర్చకోసం టీడీపీ సహా పలు పార్టీలు ఆందోళన చేస్తుంటే వీళ్లతో పాటు అవిశ్వాస తీర్మానంపై కాకుండా హైకోర్టు తదితర ఇతర సమస్యలపై టీఆర్ఎస్ ఎంపీలు పోడియంను చుట్టుముట్టారు. ఆ సమయంలోనే మమత కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్ పెట్టాలనుకుంటున్న మీరు.. అవిశ్వాస తీర్మానంపై చర్చకోసం ఎందుకు పట్టుపట్టడం లేదని..?! ఇక రెండోది కర్నాటక ఎన్నికలు హంగ్ దిశగా పయనిస్తున్నాయన్న సమయంలో కేసీఆర్ బెంగళూరు వెళ్లి దేవెగౌడ, కుమారస్వామిలతో భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల హడావుడిలో ఉన్నామని, ఇప్పుడు ఫ్రంట్ పై చర్చించే అవకాశం లేదని వాళ్లిద్దరూ తేల్చిచెప్పినా కేసీఆర్ పనిగట్టుకుని బెంగళూరు వెళ్లి వాళ్లతో భేటీ అయ్యారనేది టాక్. కర్నాటకలో హంగ్ వస్తే బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు జేడీఎస్ ను ఒప్పించేందుకే కేసీఆర్ బెంగళూరు వెళ్లారనే వార్తలు అప్పట్లోనే వినిపించాయి. ఆ తర్వాత కుమారస్వామి ప్రమాణస్వీకారానికి దేశవ్యాప్తంగా ఉన్న విపక్షనేతలంతా హాజరుకాగా కేసీఆర్ మాత్రం డుమ్మా కొట్టారు.
ఇక అన్నిటికీ మించి తెలంగాణలో కాంగ్రెస్ ను మాత్రమే టార్గెట్ గా చేసుకున్న కేసీఆర్ చేస్తున్న కామెంట్స్ మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అన్ని రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తుండగా ఒక్క తెలంగాణలో మాత్రం అంటీముట్టనట్టు వ్యవహరిస్తోందనే టాక్ తెలంగాణ బీజేపీ నేతల నుంచే వినిపిస్తోంది. ఇక నీతిఆయోగ్ సమావేశం కంటే ముందే ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏకాంతంగా భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. నీతి ఆయోగ్ భేటీలో పాల్గొన్న కేసీఆర్ ను చూసిన వాళ్లంతా ఆయన కమలంవైపే అనేలా ఆయన మాటతీరు ఉందంటున్నారు. మోదీని పొగడడాన్ని బట్టి కేసీఆర్ ఫ్రంట్ బీజేపీకి మేలు చేసేందుకే అనే టాక్ బలపడింది.