ఎన్నికల మేనేజ్ మెంట్ స్కిల్స్ లో చంద్రబాబునాయుడు ముందు వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిలవలేరు'...
ఇవి తాజాగా చంద్రబాబు, జగన్ పై రాజమండ్రి మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యక్తం చేసిన అభిప్రాయం. ఆ విషయంలో ఎవరికీ ఎటువంటి సందేహం లేదు. ఆమధ్య జరిగిన కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికే అందుకు సాక్ష్యం. ఉప ఎన్నికల్లో అందరూ వైసిపి అభ్యర్ధే గెలుస్తాడనే అనుకున్నారు. ఎందుకంటే అంత స్ధాయిలో జగన్ కు జనాలు స్పందించారు కాబట్టి. అదే సమయంలో చంద్రబాబు రోడ్డు షోలకు, సభలకు జనాల స్పందన అంతంత మాత్రంగానే కనిపించింది. దాంతో వైసిపి అభ్యర్ధి గెలుపు ఖాయమనే అనుకున్నారు. తీరా చూస్తే టిడిపి అభ్యర్ధి 27 వేల భారీ మెజారిటీతో గెలిచారు. దాంతో యావత్ రాష్ట్రం ఆశ్చర్యపోయారు. అప్పుడే అందరికీ అర్దమైపోయింది చంద్రబాబుకున్న ఎన్నికల మేనేజ్ మెంట్ స్కిల్స్.
చంద్రబాబు దగ్గర బాగా డబ్బుంది
ఉండవల్లి తాజాగా మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు అధికారంలో ఉండటమే కాకుండా డబ్బు కూడా విపరీతంగా తోడయ్యిందన్నారు. ఆ విషయంలో జగన్ బాగా వీకని ఉండవల్లి చెప్పింది నిజమే. క్షేత్రస్ధాయిలో చూస్తేనేమో ప్రజల మొగ్గు వైసిపి వైపే ఉన్న మాట వాస్తవమే అయినా చంద్రబాబును తక్కువ అంచనా వేసేందుకు మాత్రం లేదని హెచ్చరించారు. అధికారం నిలుపుకోవటానికి కేంద్రంలో నరేంద్రమోడి, ఇక్కడ చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.
ఎన్నికలు వన్ సైడేనా ?
టిడిపికి మద్దతిచ్చే మీడియా ప్రకటించిన తాజా సర్వేపై స్పందిస్తూ, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అధికారంలోకి వచ్చేది వైసిపియేనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మళ్ళీ టిడిపి అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవన్న విషయం టిడిపి నేతలకు కూడా బాగా తెలుసన్నారు. జన స్పందన చూస్తే ఎన్నికలు వన్ సైడ్ గా జరుగుతుందేమో అని అనిపిస్తున్నా, ఎక్కడో చంద్రబాబుపై అనుమానం కలుగుతోందన్నారు. మొన్నటి ఎన్నికల్లో మోడి, పవన్ మద్దతే చంద్రబాబుకు బాగా కలసివచ్చిందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. బిజెపి, పవన్ టిడిపి నుండి విడిపోయిన నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో పవన్ ప్రభావం ఇప్పుడే అంచనా వేయలేమని ఉండవల్లి చెప్పారు.