లగడపాటి ఈ మధ్య ఆంధ్ర ప్రదేశ్ లో హల చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సర్వే మీద ఎవరికీ నమ్మకాలు లేవని చెప్పాలి ఎందుకంటే అది పూర్తిగా టీడీపీ కి అనుకూలంగా చేయించుకున్నారని తెలుస్తుంది. పచ్చ మీడియా మరియు లగడపాటి ఇద్దరూ కలిసి ఒక పార్టీ కి అనుకూలంగా విజయం అని చెప్పారు. అయితే ఇప్పటికే ఈ సర్వే మీద చాలా మంది విమర్శలు చేస్తున్నారు. కాగా కాంగ్రెసు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కొన్ని ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేసినాడు. గతంలో కంటే టీడీపీకి ఎక్కువ సీట్లు వస్తాయని, వైకాపాకు ఇంకా తగ్గుతాయని ఆ సర్వే తెలియచేసింది.
చంద్రబాబు మీద ప్రజాభిమానం చెదరలేదని వెల్లడించింది. 'ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే' అనే పేరుతో సర్వేలు చేయడం మీడియా సంస్థలకు మామూలే. ఆంధ్రజ్యోతి-ఫ్లాష్ టీమ్ సర్వే ఉద్దేశం ఏమిటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఉండవల్లి అరుణ్కుమార్ సర్వే చేయించారా? ఏవైనా లెక్కలుగట్టి అంచనాలు తయారుచేశారో తెలియదుగాని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏమవుతుందో చెప్పారు. ఈయన సర్వే లేదా అంచనా ప్రకారం వైఎస్ జగన్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఇద్దరే. ఇద్దరూ మొనగాళ్లే. చిక్కడు... దొరకడు టైపు. అసలు విషయం చెప్పకుండా సినిమా టైటిల్స్ ఏమిటి అనుకుంటున్నారా? ఉండవల్లి సర్వే సారాంశం ఇదే.
ఇద్దరికీ సమానమైన మార్కులేశారు. మొదటి పాయింట్... ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే వైకాపాకే ఎక్కువ సీట్లు వస్తాయి. ప్రజల్లో వేవ్ జగన్కు అనుకూలంగా ఉంది. రెండో పాయింట్... జగన్కున్న అనుకూల వేవ్ను మార్చగలిగే సామర్థ్యం చంద్రబాబు నాయుడికి ఉంది. వేవ్ ఉండటం జగన్కు ప్లస్ అయితే, దాన్ని తలకిందులు చేయగల సామర్థ్యం ఉండటం చంద్రబాబుకు ప్లస్. ఉండవల్లి ఎవరికి అనుకూలంగా చెప్పినట్లు! ఒకవిధంగా చూస్తే చంద్రబాబుకే అనుకూలంగా చెప్పారనుకోవాలి. జగన్ అనుకూల పవనాలను తనవైపు మళ్లించుకోగల సామర్థ్యం ఉండటం గొప్ప విషయం కదా.