అదేంటో చంద్రబాబునాయుడును గతం వదిలేట్లుగా లేదు. 1999లో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు వ్యవహరించిన తీరు ప్రజలకు బాగా గుర్తుండే ఉంటుంది. పరిపాలనలో తన ముద్రకోసం తపించిపోయే చంద్రబాబు అడ్డుగోలుగా వ్యవహరించారు. రైతులు, యువత, మహిళలు, డ్వాక్రా సంఘాలు...ఇలా వాళ్ళు వీళ్ళని లేకుండా ప్రతీ వర్గంతోనూ తగాదాలు పెట్టుకున్నారు. దాంతో ఒళ్ళు మండిపోయిన జనాలు పదేళ్ళపాటు ప్రతిపక్షానికే పరిమితం చేసేశారు చంద్రబాబును. చివరకు 2003 ఎన్నికలకు ముందు అలిపిరిలో జరిగిన మావోయిస్టుల దాడి కూడా చంద్రబాబుపై సానుభూతి కురిపించలేదు.
బషీర్ బాగ్ కాల్పులను మరచిపోగలరా ?
అప్పటి ఎన్నికలకు ముందు హైదరాబాద్ లోని బషీర్ బాగ్ లో ప్రతిపక్షాలతో పాటు రైతులపై జరిపిన కాల్పుల ఘటనను ఎవ్వరూ మరచిపోలేరు. అప్పట్లో జరిగిన విద్యుత్ ఉద్యమం-ప్రతిపక్షాలపై చంద్రబాబు ప్రభుత్వం కాల్పులు దేశంలోనే సంచలనమైంది. ఇక, డ్వాక్రా మహిళలపై గుర్రాలతో తొక్కించటం, వాటర్ క్యానన్లతో రోడ్లపై ఈడ్చి కొట్టటాన్ని ఎవరైనా మరచిపోగలరా ? ఉద్యోగాలకోసం యువత రోడ్డెకితే వారిపై లాఠీచార్జి జరగటాన్ని ఎలా మరచిపోతారు ? ఈ విధంగా ప్రతీ వర్గంతోనూ అప్పట్లో చంద్రబాబు సున్నం పెట్టుకున్నారు. విజన్ 20-20 పేరుతో ప్రచారాన్ని ఊదరగొట్టిన చంద్రబాబు తనకు ఏకంగా 20 ఏళ్ళపాటు ఎన్నికల్లో తిరుగేలేదనుకున్నారు.
10 ఏళ్ళు ప్రతిపక్షానికే పరిమితం
అటువంటిది 2003 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి పదేళ్ళు ప్రతిపక్షానికే పరిమితమవ్వాల్సొచ్చింది. రాష్ట్ర విభజన నేపధ్యంలో ఏదో నరేంద్రమోడి, పవన్ కల్యాణ్ మద్దతుతో ఎలాగోలా ముఖ్యమంత్రయ్యారు. నాలుగేళ్ళు గడచిపోయి మళ్ళీ ఎన్నికలు దగ్గరకు వస్తోంది. ఇటువంటి నేపధ్యంలో రాష్ట్రంలో 2003 వాతావరణమే కనబడుతోందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే, ఇపుడు కూడా రుణమాఫీ సక్రమంగా జరగకపోవటంతో రైతులు చంద్రబాబుపై మండిపోతున్నారు. హామీ ఇచ్చిన స్ధాయిలో ఉద్యోగాలు భర్తీ చేయకపోవటంతో నిరుద్యోగులు కోపంతో ఉన్నారు. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు. ఇక, రిజర్వేషన్లపై ఇటు కాపులు,అటు బిసిలు చంద్రబాబుపై కత్తులు నూరుతున్నారు. డ్వాక్రా మహిళల సంగతైతే చెప్పనే అక్కర్లేదు.
అప్పుడు వైఎస్సార్..ఇపుడు జగన్
పై వర్గాలన్నీ చంద్రబాబు వైఖరి వల్లే ప్రభుత్వానికి వ్యతిరేకమయ్యాయన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తాజాగా నాయీబ్రాహ్మణులపై చంద్రబాబు రెచ్చిపోవటం చూస్తుంటే చేతులారా చంద్రబాబు చేటు తెచ్చుకుంటున్నారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. దానికితోడు అప్పట్లో ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో పాదయాత్ర చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. యాధృచ్చికమో ఏమోగానీ ఇపుడు కూడా వైఎస్ కొడుకు, వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలోనే రాష్ట్రంలో పాదయాత్ర చేస్తుండటం గమనార్హం.