'చంద్రబాబునాయుడు వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారు'..తాజాగా భారతీయ జనతా పార్టీ ఎంఎల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు. నాయీ బ్రాహ్మణులతో చంద్రబాబు వ్యవహరించిన విధానంపై వీర్రాజు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు వ్యవహారం ఓ వీధిరౌడీల ఉందన్నారు. తమ సమస్యలు చెప్పుకోవటానికి వచ్చిన నీయీ బ్రాహ్మణ నేతలతో చంద్రబాబు దురుసుగా ప్రవర్తించారంటూ మండిపడ్డారు. తన ప్రవర్తనకు చంద్రబాబు వెంటనే వారికి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ కూడా చేశారండోయ్.
లక్షల కోట్ల అవినీతి
కేంద్ర ప్రభుత్వ పథకాలు ముఖ్యమంత్రికి, టిడిపి నేతలకు ఉపాధిహామీ పథకాలుగా మారిపోయాయట. ఎందుకంటే, నీరు-చెట్టు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, గృహనిర్మాణ పథకాల్లో రూ. 30 వేల కోట్ల అవినీతి జరిగిందని వీర్రాజు చాలా కాలంగా ఆరోపణలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు లక్షల కోట్ల అవినీతికి పాల్పడినట్లు రాజు ఆరోపణలు చేస్తున్నారు.
విమ్స్ కు రూ. 100 కోట్లు కేటాయించలేదు
ఇఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి చాలా కాలంగా స్ధలం కేటాయించని ప్రభుత్వం ఇపుడు విశాఖపట్నం నుండి సదరు ఆసుపత్రిని విజయవాడకు తరలించాలని ప్రయత్నిస్తున్నట్లు మండిపడ్డారు. విశాఖపట్నం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)కు రూ. 100 కోట్లు అవసరమని ఎంత మొత్తుకుంటున్నా చంద్రబాబు పట్టించుకోవటం లేదంటూ ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్రాల అభివృద్ధిపై తాము చర్చకు సిద్దమని, టిడిపి నేతలు సిద్దమా అంటూ సవాలు కూడా విసిరారు లేండి.