తెలుగుదేశంపార్టీ చేసుకుంటున్న ప్రచారం చూస్తుంటే గోబెల్స్ ఎందుకు పనికొస్తాడా అన్న సందేహాలు వస్తున్నాయి ? ఒకపుడు సెల్ఫ్ డబ్బా ఎక్కువైపోతున్నా లేకపోతే లేనిది ఉన్నట్లు చెప్పుకుంటున్నా గోబెల్స్ ప్రచారం అని అనేవారు అందరూ. చంద్రబాబునాయుడు, టిడిపి నేతలు లేకపోతే టిడిపికి మద్దతుగా నిలుస్తున్న మీడియా వరస చూస్తుంటే గోబెల్స్ కే పాఠాలు నేర్పేలాగున్నారు. ఎన్డీఏలో ఉన్నంత కాలం ఒక విధంగా మాట్లాడిన చంద్రబాబు ఇపుడు మాట్లాడుతున్న తీరు చూస్తే గోబెల్స్ కూడా పనికిరాడని కచ్చితంగా అంగీకరించాల్సిందే.
ఎన్డీఏలో ఉన్నపుడు సంగతేంటి ?
ఎన్డీఏలో ఉన్నంత కాలం రాష్ట్ర ప్రయోజనాలకన్నా స్వప్రయోజనాలకే చంద్రబాబు పెద్దపీట వేశారనే ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఎలాగంటే, విభజన చట్టంలోని ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వేజోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ లాంటి వాటి గురించి ఎన్నడూ మాట్లాడని సంగతి అందరికీ తెలిసిందే. పైగా అదే డిమాండ్లతో ప్రధాన ప్రతిపక్షం వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఆందోళనల్లో పాల్గొంటే కేసులు పెడతామని బెదిరించారు చంద్రబాబు. నిజానికి నాలుగేళ్ళుగా ప్రత్యేకహోదా డిమాండ్ సజీవంగా ఉందంటే అందుకు కారణం వైసిపినే అన్న విషయం అందరికీ తెలిసిందే.
ఎన్డీఏలో నుండి వచ్చేసిన తర్వాత ?
ఎన్డీఏలో చంద్రబాబు ఉన్నపుడు కూడా జనాల్లో ప్రత్యేకహోదా సెంటిమెంటుంది. అయితే, దాన్ని బయటపడకుండా చంద్రబాబు శతవిధాల ప్రయత్నించారు. ఎప్పుడైతే ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేశారో వెంటనే హోదా డిమాండ్ ను అందుకున్నారు. నాలుగేళ్ళుగా ప్రత్యేకహోదా కోసం కేంద్రంతో పోరాడుతున్నది తానేనంటూ బిల్డప్ మొదలుపెట్టారు. దానికి అనుగుణంగానే టిడిపి మొత్తం హోదా భజన అందుకుంది. దాంతో టిడిపికి మద్దతుగా నిలిచే మీడియా కూడా చంద్రబాబును హోదా పోరాట యోధునిగా ఆకాశానికెత్తేస్తోంది. చంద్రబాబు హోదా వల్ల ఉపయోగం లేదని చెప్పినపుడు ఇదే మీడియా అసలు హోదా వల్ల ఉపయోగమే లేదని ఊరూవాడా ప్రచారం చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.
మాఫీల సంగతేంటి ?
ఇక, పోయిన ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీల విషయంలో కూడా అదే వరస కనబడుతోంది. తానిచ్చిన 600 హామీల్లో ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా చంద్రబాబు అమలు చేయలేదు. అయితే, ఇచ్చిన హామీల్లో 98 శాతం అమలు చేసేశామని చంద్రబాబు చెబుతున్నారు. టిడిపి మీడియా కూడా అదే విషయాన్ని పదే పదే ప్రచారం చేస్తోంది. నాలుగేళ్ళ పాలనలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. టిడిపి నేతల ధౌర్జన్యలు తారస్ధాయికి చేరుకున్నాయి. అయితే, తాను పారదర్శక పాలన అందిస్తున్నానని చంద్రబాబు చెబుతుంటే మీడియా కూడా భజన చేస్తోంది. తన పాలనలో అవినీతికి తావు లేకుండా చేసినట్లు చంద్రబాబు చెప్పగానే సదరు మీడియా కూడా అదే ప్రచారం మొదలుపెట్టింది. అంటే, మీడియా చేస్తోందేమిటంటే, చంద్రబాబు అవునంటే అవునని, కాదంటే కాదని ప్రచారం చేస్తోంది. బహుశా టిడిపి మీడియా దృష్టిలో తానేం చెప్పినా జనాలు నమ్మేస్తారనే గుడ్డి నమ్మకంతో ఉన్నట్లు కనబడుతోంది.
తాజా సర్వే ఏం చెబుతోంది
తాజాగా ప్రచురించిన సర్వేనే తీసుకుందాం. 18 నియోజకవర్గాల్లో సర్వే చేసి అవే ఫలితాలను మొత్తం 175 నియోజకవర్గాలకూ ఆపాదించటం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. బహుశా వచ్చే ఎన్నికల్లో గెలుపోటములను తానే శాసిస్తాను అని అనుకునే స్ధాయికి సదరు మీడియా పిచ్చి పీక్ కు చేరుకుందేమో అన్న అనుమానాలు వస్తున్నాయి. జనాల మైండ్ సెట్ ఎవరూ మార్చలేరన్నది వాస్తవం. కానీ తాను మాత్రం జనాల మైండ్ సెట్ ను మార్చగలనన్న నమ్మకంతోనే గోబెల్స్ ను తలదన్నే రీతిలో చంద్రబాబును ఆకాశానికెత్తేస్తోంది. నిజానికి ప్రతీ రాజకీయ నాయకుడూ ఇదే విధంగా ఉంటారు. కాకపోతే వాళ్ళని భూమి మీదకు దింపాల్సిన బాధ్యత మీడియాపైన ఉంటుంది. అలాకాకుండా నేతలకు అనుగుణంగా భజన చేస్తోందంటేనే సదరు నేతలకు బ్యాడ్ టైం మొదలైనట్లే అనుకోవాలి.