బాబు సర్వే అయింది. ఇపుడు గంటా మార్క్ సర్వే బయటకొచ్చింది. ఇప్పటికి ఇపుడు భీమిలీలో ఎన్నికలు పెడితే 70 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తానంటూ మంత్రి గంటా చాలెంజ్ చేస్తున్నారు. తనకు ఎదురే లేని చోట ఎదురు గాలి వీస్తోందని సర్వేల పేరుతో జరుగుతున్న ప్రచారంపై ఎదురుదాడి మొదలుపెట్టారు గంటా. రాయబారానికి వచ్చిన టీడీపీ పెద్దల ముందే గంటా చాలెంజ్ చేయడంతో విస్తుపోవడం వారి వంతైంది.
నేను కాక ఇంకెవరు
భీమిలీలో మళ్ళీ టీడీపీ జెండా ఎగరాలంటే తానే అభ్యర్ధిగా వుండాలని గంటా స్పష్టంగా చెప్పారట. అంటే బీమిలీలో తాను తప్ప ఇంకెవరూ పార్టీకి దిక్కు లేదని గంటా చెప్పకనే చెప్పినట్లైంది. వచ్చే ఎన్నికల్లో భీమిలీ నుండి అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివాస్ పోటీ చేయాలని అనుకుంటున్నట్లు జరుగుతున్న ప్రచారానికి గంటా ఈ విధంగా చంద్రబాబుకు హెచ్చరికలు పంపినట్లుంది చూడబోతే. వందల కోట్ల తో అక్కడ అభివ్రుధ్ధి పనులు చేశానని కాబట్టి జనం తననే మళ్ళీ ఎన్నుకుంటారని గంటా ధీమా వ్యక్తం చేశారట. ఓడిపోతానని చెప్పిన చోటనే బంపర్ మెజారిటీతో గెలిచి చూపిస్తానన్ని పరోక్షంగా హై కమాండ్ కే గంటా సవాల్ విసిరేశారు.
భీమిలీ నుండే గంటా పోటీ
గంటాతో బుజ్జగింపుల పర్వం ముగిసిన తరువాత సహచర మంత్రి నిమ్మకాయల మీడియాతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికలలోను తమ అభ్యర్ధి గంటాయే అంటూ స్పష్టం చేయడం గమనార్హం. ఓడిపోతారని సర్వేలు చెప్పొచ్చు, కానీ గెలిచేది మా గంటాయేఅన్నారు. దీంతో హై కమాండ్ తన తప్పు దిద్దుకుందా, సర్వే మొత్తం తప్పు అని ఒప్పుకుందా, లేక గంటా తో రాజీ చేసుకుందా ? అన్న విషయమే జిల్లాలోని ఇతర నేతలకు అర్దం కాలేదు.