ప్రత్యేకహోదా డిమాండ్ తో ఐదుగురు వైసిపి ఎంపిలలు చేసిన రాజీనామాలను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. గురువారం సాయంత్రం వారి రాజీనామాలను ఆమోదిస్తున్నట్లు స్పీకర్ వారికి సమాచారం అందించారు. హోదా డిమాండ్ తో మొన్న ఏప్రిల్ 6వ తేదీన తిరుపతి ఎంపి వరప్రసాద్, నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఒంగోలు ఎంపి వైవి సుబ్బారెడ్డి, కడప ఎంపి అవినాష్ రెడ్డి, రాజంపేట ఎంపి మిధున్ రెడ్డిలు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. రాజీనామాలు చేయటంతో పాటు ఏపి భవన్లో ఎంపిలు ఆమరణ దీక్షలు చేసిన సంగతి కూడా తెలిసిందే.
ఎంపిలు రాజీనామాలు చేసిన దగ్గర నుండి చంద్రబాబునాయుడుతో పాటు టిడిపి నేతలు పలువురు రాజీనామాలపై ఎకసెక్కాలాడిన విషయం అందరూ చూసిందే. రాజకీయ లబ్ది కోసమే వైసిసి ఎంపిలు రాజీనామా డ్రామాలాడినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. స్పీకర్ పై ఒత్తిడి పెట్టి తమ రాజీనామాలను ఆమోదించుకోవాలనే విచిత్రమైన సవాలును కూడా చంద్రబాబు ఎన్నోసార్లు ప్రస్తావించారు. అటువంటిది ఇపుడు స్పీకర్ వారి రాజీనామాలను ఆమోదించటంతో చంద్రబాబు అండ్ కో ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిందే.
ఇక మిగిలింది ఉప ఎన్నికల నిర్వహణే. అయితే, ఉప ఎన్నికలు నిర్వహించాలా ? వద్దా అన్నది తేల్చాల్సింది ఎన్నికల కమీషనే. సాధారణ ఎన్నికలకు ఏడాది సమయం కూడా లేదు. ఇటువంటి నేపధ్యంలో ఎన్నికల కమీషన్ ఉప ఎన్నికలు నిర్వహిస్తుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. ఒక వేళ ఉప ఎన్నికలు నిర్వహించినా, నిర్వహించకపోయినా వైసిపికి మాత్రం ప్లస్సే.