వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల పంపిణీకి సంబంధించి ప్రధాన పార్టీలు బిసిలకే పెద్ద పీట వేసేట్లు కనబడుతున్నాయి. పోయిన ఎన్నికల వరకూ అన్నీ పార్టీలూ కాపులకు కూడా సముచిత స్ధానమే ఇచ్చేవి.. అయితే మారుతున్న రాజకీయ పరిస్ధితుల్లో కాపులకు బదులు బిసిలకు పెట్ట పీట వేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఎందుకంటే, మొన్నటి ఎన్నికల వరకూ సామాజికవర్గాల వారీగా ప్రత్యేకించి రాజకీయ పార్టీలంటూ లేవనే చెప్పాలి. ఏదో ప్రాంతాన్ని బట్టో లేకపోతే నియోజకవర్గాల్లోని సామాజివకవర్గం జనాభాను బట్టో అక్కడక్కడ టిక్కెట్లు కేటాయించే వారు. అయితే, వచ్చే ఎన్నికల నాటికి పరిస్ధితులు మారిపోయేట్లే కనబడుతోంది.
ఎవరి అవకాశాలు వారికి దక్కేవి
ఇంతకీ విషయం ఏమిటంటే, కాంగ్రెస్, తెలుగుదేశం, వైసిపిలు సంప్తదాయానుసారంగా అన్నీ సామాజికవర్గాల్లోని నేతలకు టిక్కెట్లు ఇచ్చాయి. కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీగా, తెలుగుదేశంపార్టీ కమ్మోరి పార్టీగా ప్రచారంలో ఉన్నా టిక్కెట్ల పంపిణిలో ఎవరికి దక్కే అవకాశాలు వాళ్ళకు దక్కేవి. అదే విధంగా మొదటిసారి 2014 సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన వైసిపి కూడా దాదాపు అందరికీ టిక్కెట్లు ఇచ్చింది. ఉభయగోదావరి జిల్లాలను తీసుకుంటే ఏ పార్టీ అయినా కాపులకు ఎక్కువ స్ధానాలు ఇచ్చేది. అదే విధంగా ఉత్తరాంధ్ర వచ్చేసరికి అక్కడి సామాజికవర్గాలను బట్టి టిక్కెట్లు కేటాయించేది. రాయలసీమ విషయానికి వస్తే ఏ పార్టీని తీసుకున్నా మెజారిట టిక్కెట్లు రెడ్లకే కేటాయించేవి.
మారిపోనున్న సామాజికవర్గాల సమతూకం
అయితే, వచ్చే ఎన్నికల్లో పైన చెప్పుకున్న సామాజికవర్గాల సమతూకం మారిపోతోందట. ఎందుకంటే, జనసేన మొదటిసారి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతోంది. ఇప్పటికైతే జనసేన పార్టీ అచ్చంగా కాపుల కోసమే పెట్టిన పార్టీగా ప్రచారంలో ఉంది. తాను అందరివాడినని ఒకవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెబుతున్నా ఎవరూ నమ్మటం లేదు. గతంలో మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ అనుభవమే ఇపుడు కూడా వెన్నాడుతోంది. అప్పట్లో పిఆర్పి కూడా కేవలం కాపుల కోసమే పెట్టిన పార్టీగా ప్రచారంలోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అదే పద్దతిలో ఇపుడు జనసేన కూడా కాపుల కోసమే పెట్టారనే ప్రచారం జనాల్లోకి వెళ్ళిపోయింది. అవునో కాదో రేపటి ఎన్నికల వరకూ ఆగితే కానీ తేలదనుకోండి.
టిడిపి, వైసిపిల్లో బిసిలకే ప్రాధాన్యమా ?
ఇటువంటి పరిస్ధితుల్లో మిగిలిన పార్టీలు జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. కాపులకు మెజారిటి టిక్కెట్లు కేటాయించటానికి ఎటూ జనసేన ఉంది కాబట్టి తమ పార్టీల్లో కాపులకు పెద్ద పీట వేయాల్సిన అవసరం లేదనేది తెలుగుదేశం, వైసిపి నేతల్లో వినిపిస్తున్న మాట. తమ పార్టీల్లో కాపులకు ఒకవేళ టిక్కెట్లు కేటాయించినా జనసేన తరపున పోటీ చేయబోయే కాపు అభ్యర్ధికే ఆ సామాజికవర్గం ఓట్లు వేస్తుందని పై పార్టీల్లో చర్చలు జరుగుతున్నాయి. అటువంటి పరిస్ధితుల్లో ప్రత్యామ్నాయంగా బిసిలకు పెట్ట పీట వేస్తే తమకు గణనీయంగా ఓట్లు పడే అవకాశాలను పార్టీలు పరిశీలిస్తున్నాయి. అందుకనే నియోజకవర్గాల వారీగా సామాజికవర్గాల ఓట్లపై పై పార్టలు దృష్టి పెట్టినట్లు సమాచారం.
రెండు పార్టీలూ బిసిలపైనే గురి
చాలా నియోజకవర్గాల్లో కాపు, బిసి సామాజికవర్గాల జనాభా దాదాపు సమానంగానే ఉంటాయి. కొన్ని నియోజకవర్గాల్లో అయితే బిసిల జనాభా చాలా ఎక్కువ. జనాభా ఆధారంగానే ఓట్లు కూడా ఉంటాయి కాబట్టి బిసి సామాజికవర్గాల్లో గట్టి నేతలపై రెండు పార్టీలు గురిపెట్టాయి. సో, జరుగుతున్న మార్పులను బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో మెజారిటీ నియోజకవర్గాల్లో కాపులు, బిసిలే ప్రధాన పాత్ర పోషించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే, ఏ పార్టీ ఏ సామాజికవర్గానికి ఎక్కువ టిక్కెట్లు కేటాయిస్తుందన్నదే సస్పెన్స్ .