కొన్ని విషయాలను మొదట్లో నమ్మలేము. అటువంటిదే ఇది కూడా. ఏపి కాంగ్రెస్ నేత, సమైక్య రాష్ట్రంలో స్పీకర్ గా పని చేసిన నాదెండ్ల మనోహర్ వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో పోటీ చేయాలని ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఏపిలో ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్దితిని గమనిస్తున్న వారికెవరికి వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటులో కూడా గెలుస్తుందనే నమ్మకం లేదు. ఎందుకంటే, పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి జనాలు సమాధి కట్టేసినట్లే. రాష్ట్ర విభజన పాపం మొత్తం కాంగ్రెస్ ఖాతాలో పడటంతో పాటు విభజనను పార్టీ అధిష్టానం అడ్డుగోలుగా చేయటంతో జనాలు మండిపోయారు. దాంతో పదేళ్ళపాటు అధికారంలో ఉన్నప్పటికీ చాలా నియోజకవర్గాల్లో కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. వచ్చే ఎన్నికల్లో కూడా పార్టీ పరిస్దితిలో మార్పు వస్తుందన్న నమ్మకం ఏ నేతలోనూ కనబడటం లేదు.
ఏపిలో కాంగ్రెస్ కు బ్రతుకు లేదా ?
ఇటువంటి నేపధ్యంలోనే మళ్ళీ ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయి. రాజకీయాల్లో ఉండాలని అనుకుంటున్న కాంగ్రెస్ నేతల్లో చాలామందికి ఏం చేయాలో అర్ధం కావటం లేదు. పోయిన ఎన్నికల్లోనే పలువురు టిడిపిలోకి, వైసిపిలోకి దూకేశారు. మిగిలిన నేతల్లో కొంతమంది భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ పరిస్దితుల్లో కాంగ్రెస్ పార్టీలోనే మిగిలి పోయిన నేతలు ఏదో ఒక పార్టీలోకి చేరే ఆలోచనలో ఉన్నారన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ లో ఉంటే రాజకీయంగా బతుకు లేదు అన్నది స్పష్టమైపోయింది. అదే సమయంలో మనోహర్ తో వైసిపి నేతలు టచ్ లో ఉన్నారన్న ప్రచారం కూడా జరిగింది.
ఆశలు వదిలేసుకుంటున్న నేతలు ?
ఈ పరిస్దితుల్లోనే అటు టిడిపిలోకి ఇటు వైసిపిలోకి చేరటం ఇష్టం లేని వాళ్ళు కూడా కాంగ్రెస్ లో కొందరున్నారు. అటువంటి వాళ్ళల్లో నాదెండ్ల మనోహర్ ముందు వరసలో ఉంటారు. ఇక్కడే మనోహర్ కు సమస్య మొదలైంది. పోయిన ఎన్నికల్లో గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ నుండి పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా గెలిచే ముచ్చట కనిపించటం లేదు. అందుకని ఏం చేయాలని ఆలోచిస్తున్న మనోహర్ కు తెలంగాణాలోకి వలస వెళ్ళిపోవటం ఒకటే మార్గంగా కనిపించిందట. చాలా మంది నేతలకున్నట్లే మూలాలు ఆంధ్రానే అయినా పెరిగింది, సెటిలైంది హైదరాబాద్ లోనే.
పెండింగ్ లో దరఖాస్తు
కాబట్టి వచ్చే ఎన్నికల్లో తాను తెలంగాణా రాష్ట్రం నుండి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల్ గాంధికి దరఖాస్తు పెట్టుకున్నారట. అదింకా పెండిగింలోనే ఉందని సమాచారం. ఈ మధ్యే ఢిల్లీలో ఏపి నేతలంతా రాహూల్ ను కలిసినపుడు కూడా మనోహర్ తన విషయాన్ని కదిపారట. అయితే, ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున ఇపుడే తొందరలేదని రాహూల్ అనుకుంటున్నట్లు సమాచారం. మనోహర్ ఏపిని వదిలేసి తెలంగాణాలో పోటీ చేసే విషయంలో ఇరు రాష్ట్రానికి చెందిన నేతల్లోనూ పెద్దగా అభ్యంతరాలు కూడా వ్యక్తం కావటం లేదని పార్టీ వర్గాలు చెప్పాయి.
ఎక్కడి నుండి పోటీ ?
రాహూల్ నుండి గ్రీన్ సిగ్నల్ వస్తుందన్న నమ్మకంతోనే మనోహర్ సేఫ్ నియోజకవర్గంపై ఆరాలు తీస్తున్నట్లు సమచారం. అందులో భాగంగానే ఖమ్మం, మల్కాజ్ గిరి పార్లమెంటు స్ధానాలు కానీ కూకట్ పల్లి, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజవర్గాలు కానీ పోటీ చేయటానికి అనువుగా ఉంటుందని మనోహర్ భావిస్తున్నారట. పై నియోజకవర్గాల్లో సీమాంధ్రులే ఎక్కువగా ఉన్నందు వల్ల గెలుపు కూడా కష్టం కాదని మనోహన్ భావన. అందులోనూ తెలంగాణా కాంగ్రెస్ లో కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలు పెద్దగా లేరు. సెటిలర్లలో కమ్మ సామాజికవర్గానికి చెందిన జనాలు భారీ సంఖ్యలో ఉండటం కూడా పై నియోజకవర్గాలపై మనోహర్ కన్నేయటానికి కారణమైంది. కాకపోతే మనోహర్ ప్రయత్నాలు ఎంత వరకూ ఫలిస్తాయో చూడాలి.