దేశం మొత్తం మీద ఏపినే నెంబర్ 1 అని అందరూ అంటున్నారట. ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు చంద్రబాబునాయుడే. నీరు-ప్రగతి, వ్యవసాయంపై ఉదయం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారులేండి. అప్పుడు మాట్లాడుతూ, ఈ ఏడాది వివిధ రంగాల్లో రాష్ట్రానికి ఏకంగా 60 అవార్డులు వచ్చాయని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు సగటున 20-30 అవార్డులు మాత్రమే రాగా ఏపికి మాత్రం 60 అవార్డులు రావటం నిజంగా గర్వకారణమన్నారు పట్టణ, గ్రామీణాభివృద్ధి, జలవనరులు, ఐటి శాఖల్లో అనేక అవార్డులొచ్చాయి. అంటే పై శాఖల్లో అమలవుతున్న పథకాల్లో ఎక్కువగా కేంద్రప్రభుత్వ నిధులే ఉండటం గమనార్హం.
ప్రపంచంలోనే నెంబర్ 1 కావాలట..
దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా నిలిచిన ఏపి ఇక ప్రపంచంలోనే నెంబర్ వన్ కావాలట. నదుల అనుసంధానం, భూగర్భజలాల పెంపు, ప్రాజెక్టులను పూర్తి చేయటంపైనే అందరూ దృష్టి పెట్టాలని చెప్పారు. అన్నీ బాగనే ఉన్నాయి కానీ వివిధ పథకాల్లో జరుగుతున్న అవినీతి మాటేంటంటూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఎందుకంటే, రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయిందని వైసిపి ఎప్పటి నుండో ఆరోపిస్తుంటే, ఈ మధ్యే బిజెపి నేతలు కూడా మొదలుపెట్టారు. వివిధ ఏజెన్సీలు కూడా రాష్ట్రంలో అవినీతి తారస్ధాయికి చేరుకున్నట్లు నివేదికలను విడుదల చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
అవినీతికి ఆధారాలివిగో
అభివృద్ది సంగతి దేవుడెరుగు, అవినీతి మాత్రం పెరిగిపోయిందని అందరూ గోల చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు కూడా విచారణపై ఆందోళన పడుతున్నారు. ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసిన తర్వాత తనపైనే కాకుండా, లోకేష్ తో పాటు పలువురు నేతలపై కేంద్రప్రభుత్వం విచారణ చేయించాలని అనుకుంటున్నట్లు స్వయంగా చంద్రబాబే బహిరంగంగా చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అంటే, ఏ స్ధాయిలో అవినీతి జరుగుతుంటే చంద్రబాబులో అంతటి భయం కనబడుతోంది ? దానికితోడు పట్టిసీమ ప్రాజెక్టులో సుమారు రూ. 400 కోట్ల అవినీతి జరిగిందని స్వయంగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. ఒక్క పట్టిసీమే కాదని పోలవరంతో పాటు పలు ఇరిగేషన్ ప్రాజెక్టులు, నీరు-చెట్టు, వ్యక్తిగతమరుగుదొడ్ల నిర్మాణం లాంటి పథకాల్లో భారీ అవినీతి జరిగిందని బిజెసి నేతలు ఆధారాలతో సహా మీడియా ముందుంచారు. విచిత్రమేమిటంటే వారి ఆరోపణలపై చంద్రబాబు ఇంత వరకూ ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం.