చంద్రబాబునాయుడు దోపిడికి ఏకంగా ఆస్కార్ అవార్డే ఇవ్వచ్చట. ఇంతకీ అంటున్నదెవరయ్యా అంటే బిజెపి ఎంఎల్సీ సోము వీర్రాజు. ఎందుకంటే, తాను అవినీతికి పాల్పడుతూ ఎదుటి వాళ్ళు అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు చేస్తున్నందుకట. చంద్రబాబు అవినీతి గురించి గునపాలు చాలవట, పెద్ద పెద్ద ప్రొక్లైనర్లే కావాలట. పోలవరం ప్రాజెక్టు ద్వారా ఎవరి అంచనాలకు అందని రీతిలో చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడుతున్నట్లు వీర్రాజు మండిపడ్డారు.
పోలవరం ప్రాజెక్టు అంచనా విలువలు రోజుకోసారి ఎందుకు మారిపోయాయో చెప్పాలంటూ చంద్రబాబును నిలదీశారు. ప్రాజెక్టు వ్యయం రూ. 16 వేల కోట్ల నుండి రూ. 53 వేల కోట్లకు పెరిగినవ విషయాన్ని వీర్రాజు గుర్తు చేశారు. చంద్రబాబును ఓ అధర్మ చక్రవర్తిగా సోము వర్ణించారు. కాబట్టి చంద్రబాబు చేస్తోంది అధర్మ పోరాటమేనంటూ ధ్వజమెత్తారు. 2019లో ఏం జరగాలో చంద్రబాబుకు ఎటువంటి శాస్తి జరగాలో అదే జరుగుతుందని కూడా జోస్యం చెప్పారు.
సరే, పనిలో పనిగా కేంద్రప్రభుత్వం గురించి పాడిన పాటే పాడి వినిపించారనుకోండి అది వేరే సంగతి. విభజన హామీల అమలుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. నన్నయ్య వర్సిటీ కోసం టిడిపి కేవలం కాంపౌండ్ మాత్రమే కట్టిందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న అనేక పథకాలకు కేంద్రమే నిధులు మంజూరు చేస్తోందని చెప్పారు. వచ్చే ఎన్నికల గురించి మాట్లాడుతూ, పొత్తుల అంశంపై ఇపుడే ఏమీ చెప్పలేమని కూడా వీర్రాజు ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటేశారులేండి.
.