ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలోకి వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ అడుగుపెట్టినప్పటి నుండి కాపు సామాజికవర్గం మొత్తం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది. ఎందుకోసమో తెలుసా ? కాపుల కోసం జగన్ ఏదో ఒక స్పష్టమైన హామీ ప్రకటిస్తారని. పోయిన ఎన్నికల్లో కాపులను బిసిల్లోకి చేరుస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. హామీని నమ్మిన కాపు సామాజికవర్గంలో మెజారిటీ జనాలు చంద్రబాబుకు అనుకూలంగా ఓట్లు వేశారు.
చేతులు దులుపుకున్న చంద్రబాబు
అయితే, అధికారంలోకి రాగానే తానిచ్చిన హామీని చంద్రబాబు పక్కన పెట్టేశారు. తర్వాత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆందోళనలు, మంజూనాధ కమీషన్ నియామకం, హడావుడిగా కాపులను బిసిల్లో చేరుస్తూ మంత్రివర్గం, అసెంబ్లీలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపడం అందరూ చూసిందే. బిజెపితో హనీమూన్ లో ఉన్నంత కాలం కాపు రిజర్వేషన్ గురించి పట్టించుకోని చంద్రబాబు హనీమూన్ ముగిసే ముందు కాపుల రిజర్వేషన్ బిల్లంటూ హడావుడి చేసి చేతులు దులిపేసుకోవటంతో కాపులు మండిపోతున్నారు.
మండిపోతున్న కాపు సామాజిక వర్గం
చంద్రబాబు చేసిన పని వల్ల కాపుల్లో మెజారిటి సెక్షన్ మండిపోతోంది. అటువంటి సమయంలోనే జగన్ పాదయాత్ర మొదలుపెట్టారు. రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్ మొదలైపోయింది. ఈ ఏడాది చివరినాటికే ఎన్నికలు వచ్చేస్తాయనే వాతావరణం కనబడుతోంది. ఈ నేపధ్యంలోనే పాదయాత్ర ఉభయ గోదావరి జిల్లాల్లోకి ప్రవేశించింది. చంద్రబాబుపై మండుతున్న కాపుల్లో పలువురు పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్రలో భాగంగానే వైసిపిలో చేరారు. ఇపుడు జగన్
పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతోంది.
ఉభయ గోదావరి జిల్లాల్లో కాపులే కీలకం
ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజికవర్గానికున్నపట్టు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. రెండు జిల్లాల్లో కలిపి 34 నియోజకవర్గాలున్నాయి. ఈ జిల్లాల్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లొస్తే ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఒకటి. జగన్ తూ. గో . జిల్లాలోకి ప్రవేశించిన దగ్గర నుండి కాపులను ఆకట్టుకునే విధంగా ఓ గట్టి ప్రకటన చేయమని కాపు నేతలు జగన్ పై ఒత్తిడి తెస్తున్నారట. కాపు ఉద్యమానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో 'తుని' సంఘటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
అటువంటి తుని నియోజకవర్గంలోకి జగన్ పాదయాత్ర మరో వారం రోజుల్లో ప్రవేశిస్తోంది. ఆ నియోజకవర్గంలోనే జగన్ కాపులను ఆకట్టుకునే విధంగా ఒక ప్రకటన చేసే అవకాశం ఉందంటూ పార్టీలో ప్రచారం జరుగుతోంది. మరి జగన్ ఏం చేస్తారో అని కాపు సామాజికవర్గమంతా ఎదురు చూస్తోంది.