అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై భౌతిక దాడికి టిడిపి కార్యకర్తలు ప్రయత్నించారు. ఆర్ అండ్ బి అతిధి గృహం దగ్గరకు కన్నా చేరుకోగానే హటాత్తుగా టిడిపి కార్యకర్తలు తోసుకొచ్చేశారు. కన్నా రాక ముందుగానే తెలుసుకున్న టిడిపి నేతలు ఆందోళనకు ప్లాన్ చేశారు. ఎందుకంటే, చంద్రబాబునాయుడు పాలనపై కన్నా ఒంటికాలిపై లేస్తున్న సంగతి అందరూ చూస్తున్నదే. దాంతో టిడిపి నేతలకు కన్నాపై మండిపోతోంది.
అనంతపురంలో ఉద్రిక్తత
అనంతపురంకు కన్నా వస్తున్నట్లు తెలుసుకున్న టిడిపి నేతలు తమ నిరసనను తెలియజేయాలని అనుకున్నారు. అనుకున్నట్లే పెద్ద ఎత్తున టిడిపి శ్రేణులు గెస్ట్ హౌస్ ముందుకు చేరుకున్నారు. అయితే, కార్యకర్తలు ఒక్కసారిగా చొచ్చుకుపోవటంతో బిజెపి నేతలు బిత్తరపోయారు. వెంటనే బిజెపి నేతలు, కార్యకర్తలు తేరుకుని ఒక్కసారిగా టిడిపి శ్రేణులపై తిరగబడ్డారు. దాంతో పెద్ద ఎత్తున తోపులాటలు జరిగింది.
ఇంతలో అక్కడే ఉన్న పోలీసులు కలగ చేసుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు. అయినా టిడిపి శ్రేణులు వెనక్కు తగ్గకపోవటంతో చివరకు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. దాంతో గెస్ట్ హౌస్ లోని అద్దాలను ఆందోళణకారులు పగలగొట్టారు. అదే సమయంలో బిజెపి కార్యకర్తలు ఎదురుడాది చేసి టిడిపి జెండాలను తగలబెట్టారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవటంతో చుట్టు పక్కల ప్రాంతాల్లో టెన్షన్ నెలకొంది. ఈ మధ్యనే తిరుమల శ్రీవారి దర్శనార్ధం వచ్చిన జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్ పైన కూడా టిడిపి శ్రేణులు దాడులు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.