చాలా రోజుల తర్వాత చంద్రబాబునాయుడును వైసిపి ఎంఎల్ఏ ఆర్ కె రోజా దుమ్ము దులిపేశారు. ఒకటి కాదు రెండు అనేక అంశాలపై చంద్రబాబు, లోకేష్, దీక్ష చేస్తున్న సిఎం రమేష్ పై మండిపడ్డారు. రోజా గురువారం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళలపై పెరిగిపోతున్న అఘాయిత్యాలపై మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధి జరగకపోయినా మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు మాత్రం రెండంకెల వృద్ధి సాధించిందని ఎద్దేవా చేశారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ తో పాటు మహిళలపై దాడులు చేయిచటమే కాకుండా చివరకు అమెరికాలో షికాగోలో సెక్స్ రాకెట్ వెలుగు చూడటంతో తెలుగు వాళ్ళ పరువు తీసేస్తున్నట్లు చంద్రబాబుపై మండిపోయారు.
సెజ్ లు, పరిశ్రమలు వైఎస్ చలవే
వైసిపిపై నేరుగా ప్రెస్ మీట్ పెట్టే ధైర్యం లేక, వైసిపి నేతలను ఎదుర్కొనే దమ్ము లేకే లోకేష్ ట్వీట్లను నమ్ముకున్నట్లు చెప్పారు. లోకేష్ కు పప్పు అనే పేరు చక్కగా సరిపోతుందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో కూడా లోకేష్ కు తెలీదన్నారు. తామేదో పరిశ్రమలు తెచ్చేస్తున్నట్లు చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ అబద్దాలు చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్నట్లు మండిపడ్డారు. రాష్ట్రంలో పెట్టిన సెజ్ లయినా, వస్తున్న పరిశ్రమలైనా దివంగత సిఎం వైఎస్సార్ చలవే అన్నారు.
రమేష్ ది దొంగ దీక్షే
తర్వాత సిఎం రమేష్ దీక్షల గురించి మాట్లాడుతూ, కడప జిల్లాలో టిడిపి లో సిఎం రమేష్ అనే లీడర్ ఒకరున్నట్లు కూడా జనాలకు తెలీదన్నారు. రమేష్ ది దొంగ దీక్షగా అభివర్ణించారు. పాదయాత్రలో జగన్ కు వస్తున్న జనాధరణను తట్టుకోలేకే చంద్రబాబు దొంగ దీక్షలు చేయిస్తున్నట్లు ఆరోపించారు. నాలుగేళ్ళల్లో ఏనాడైనా పార్లమెంటులో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు గురించి ఒక్కసారైనా మాట్లాడారా అంటూ రమేష్ ను నిలదీశారు. రాష్ట్రంలోని శాంతి భద్రతల సమస్య, నారాయణ విద్యా సంస్ధల్లో విద్యార్ధినుల సమస్యలపై చంద్రబాబును రోజా దుమ్ము దులిపేశారు.