మొత్తానికి తెలుగుదేశంపార్టీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ చేస్తున్న నిరాహార దీక్ష అనేక వివాదాల మధ్య 9వ రోజు పూర్తి చేసుకుంటోంది. తొమ్మిది రోజులుగా రమేష్ చేస్తున్న నిరాహార దీక్ష పట్ల అమెరికా నుండి వచ్చిన డాక్టర్ రాజా ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం రిమ్స్ వైద్యులతో పాటు రాజా కూడా రమేష్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. పనిలో పనిగా ఈసీజీ కూడా తీశారు. బీపీ, షుగర్ లెవల్స్ పడిపోతున్నట్లు డాక్టర్లు గుర్తించారు.
సిఎం ఐసియులో ఉండాలి
ఐసియులో ఉండాల్సిన రాజ్యసభ సభ్యుడు టెంటు క్రింద దీక్ష చేయటమేంటని డాక్టర్లు టిడిపి నేతలను నిలదీశారట. ఇదేవిధంగా దీక్ష కంటిన్యూ చేస్తే గుండెకు కూడా ప్రమాదమని అందులోనూ ఇక్కడ వైద్య సదుపాయాలు కూడా సరిగా లేవని డాక్టర్లు నేతలపై మండిపడ్డారు. రాజ్యసభ సభ్యుడి ఆరోగ్య పరిస్ధితి ఆందోళనకరంగా ఉండటంతో ప్రత్యకంగా ఓ వైద్య బృందాన్ని దీక్షా శిబిరం వద్దే ఉంచుతున్నట్లు రిమ్స్ సూపరెండెంట్ గిరిధర్ చెప్పారు. సరే, దీక్షలో ఉన్న రమేష్ ను మున్సిపాలిటీ శాఖ మంత్రి నారాయణ తదితరులు వచ్చి పరామర్శించారు.
దీక్షపై వివాదం
ఇదిలా ఉంటే వైసిపి నేతలు రమేష్ దీక్షపై మండిపోతూనే ఉన్నారు. రమేష్ దంతా దొంగ దీక్షలంటూ ఎద్దేవా చేస్తున్నారు. మామూలుగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులే ఆహారం లేకుండా మూడు రోజులకన్నా ఉండలేరని అంటున్నారు. అటువంటిది రమేష్ 9 రోజులుగా దీక్ష చేస్తున్నా కొత్త పెళ్ళి కొడుకు లాగ ఎలా ఉండగలుగుతున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు తాగుతున్న నీళ్ల బాటిల్ రూ. 3 వేలంటూ ఆరోపించారు. అందులోనే ఏవో ఫ్లూయిడ్స్ కలుపుకుని తాగుతున్నట్లు ఆనుమానం వ్యక్తం చేయటం గమనార్హం.