జన సేనాని విశాఖ వచ్చి అయిదు రోజులైంది. మొదటి మూడు రోజులూ సిటీలోని రిసోర్ట్స్ల్ లో గడిపేసిన పవన్ గత రెండు రోజులుగా జనంలోకి వచ్చారు. స్థానిక సమస్యల పరిశీలన అంటూ సిటీలో కలియతిరుగుతున్నారు. మొత్తానికి పవన్ ప్రజా పోరాట యాత్ర ఊసే మరచిపోయారు. ఓ వైపు పార్టీలో చేరికలతో హుషార్ గా వున్న పవన్ అసలు సంగతే పట్టించుకొవడం లేదంటూ సెట్టైర్లు పడిపోతున్నాయి.
అపుడు రంజాన్.. ఇపుడు వరుణుడా
యాత్రకు సెలవు పెట్టడానికి పవన్ కు భలేగా సాకులు దొరికేస్తుంటాయి. తొలి విడత యాత్రను అర్ధాంతరంగా ఆపేస్తూ రంజాన్ పండుగను వాడేసుకున్నారు. ఇపుడు ఉత్తరాంధ్ర మేధావులతో సమావేశాలు అంటూ రోజులు గడిపేస్తున్న పవన్ కు ఎంచక్క వరుణుడు కరుణించాడు. విశాఖలో వానలు బాగా పడుతూండడంతో పవన్ యాత్రకు కూడా మళ్ళీ బ్రేక్ ఇచ్చేశాదు. నిజానికి యాత్ర ఈ నెల 28 నుంచి అనకాపల్లి లో ప్రారంభం కావల్సివుంది.
అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కారం
దశాబ్దాల తరబడి విశాఖ పోర్ట్ కాలుష్యం పెను సమస్యగా ఉంది. అక్కడకు వెళ్ళిన పవన్ జనసేన అధికారంలోకి వస్తే శాశ్వతంగా పరిష్కారం చూపిస్తామని బాధితులకు హామీ ఇచ్చేశారు. ఇక విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను సందర్శించిన పవన్ ప్రైవేట్ చేస్తే ఊరుకునేది లేదంటూ బాబు సర్కార్ కు వార్నింగ్ ఇచ్చారు. జనసేన సర్కార్ రాగానే అక్కడ సకల సదుపాయాలూ కల్పిస్తామన్నారు.
పనిలో పనిగా అక్కడ స్టాఫ్ తో సెల్ఫీలు దిగుతూ, మోటార్ సైకిల్ పై అక్కడ గ్రౌండ్ లో రౌండ్ కొడుతూ హుషార్ చేశారు. ఇన్ని చేస్తున్నా పవన్ ఎక్కడా యాత్ర గురించి మాట వరకైనా చెప్పడంలేదు. ఇంతకీ పవన్ ప్రజా పోరాట యాత్ర సాగుతుందా. ?