సిఎం రమేష్ ఆమరణ నిరాహార దీక్ష వ్యవహారం ఈరోజుతో తేలిపోయేట్లుంది. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు డిమాండ్ తో 11 రోజులుగా టిడిపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. రమేష్ దీక్ష చేస్తున్నా, టిడిపి ఎంపిలు కేంద్రమంత్రితో సమావేశమవుతున్నా కేంద్రం ఏమాత్రం స్పందించటం లేదు. దాంతో ఇంకా ఎన్ని రోజులు దీక్ష చేయాలనే విషయంలో టిడిపిలో అయోమయం మొదలైంది. ఇటువంటి నేపధ్యంలో ఈరోజు చంద్రబాబునాయుడు కడపకు వస్తున్నారు. దీక్షలో ఉన్న రమేష్ ను పరామర్శిస్తారు. అప్పుడే దీక్ష కొనసాగే విషయమై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తర్వాత కడప ఫ్యాక్టరీ విషయంలో చంద్రబాబు ఓ కీలక ప్రకటన చేస్తారని పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి. అంటే రమేష్ దీక్ష క్లైమ్యాక్స్ కు చేరుకుంటున్నట్లే కనబడుతోంది.
వీల్ ఛైర్లో సిఎం రమేష్
దీక్ష పదోరోజు చేరుకున్న నేపధ్యంలో రమేష్ వీల్ ఛైర్ లో కూర్చుంటున్నారు. నిన్నటి వరకూ చక్కగా చలాకీగా నడిచి తిరుగుతూ, అందరితో ఫోన్లో మాట్లాడుతుండటంతొ రమేష్ దీక్షపై ఆరోపణలు, అనుమానాలు మొదలయ్యాయి. పది రోజులుగా దీక్ష చేస్తున్నా రమేష్ ఆరోగ్యంగా ఉండటంతో పాటు బరువు కూడా తగ్గకపోవటంతో ప్రధాన ప్రతిపక్ష వైసిపి నేతలు సెటైర్లు వేస్తూ ఆరోపణలు చేస్తున్న సంగతి అందరూ చూస్తున్నదే. పైగా బాత్రూమ్ కు వెళ్ళాలన్న పేరుతో రెగ్యులర్ గా కలెక్టర్ కార్యాలయంకు వెళుతుండటం, కార్యాలయంలో ఎక్కువ సేపు ఉండటంతో అందరిలోనూ అనుమానాలు వస్తున్నాయి.
మెడికల్ మిరాకిల్
అనుమానాలకు, సెటైర్లకు జవాబుగానా అన్నట్లుగా శుక్రవారం మధ్యాహ్నం నుండి రమేష్ బాత్రూమ్ కు వెళ్ళాలంటే దీక్షా శిబిరం నుండి వీల్ ఛైర్లో వెళుతున్నారు. పెద్దగా ఎవరితోనూ మాట్లాడటం లేదు. నిలకడగా ఉన్న రమేష్ ఆరోగ్యంపై ఒకవైపు డాక్టరు కూడా ఆశ్చర్యపోతున్నారట. ఎందుకంటే, బిపి, షుగర్ ఉన్న రమేష్ అన్ని రోజుల దీక్ష తర్వాత కూడా ఆరోగ్యంగా ఉండటం మెడికల్ మిరాకిల్ అంటున్నారట.
చంద్రబాబు పరామర్శ
దీక్షలో ఉన్న రమేష్ ను పరామర్శించేందుకు చంద్రబాబునాయుడు శనివారం కడపకు వస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సిఎం కడపకు చేరుకుంటారు. ముందు రమేష్ ను పరామర్శించిన తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంఎల్సీ బిటెక్ రవిని కూడా పరామర్శిస్తారు. త్వరలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మొత్తానికి రమేష్ దీక్షను చంద్రబాబు బాగానే హైలైట్ చేసుకుంటున్నారు.