ఎన్నికల ప్రచారం కోసం చంద్రబాబు ఏ ఒక్క అవకావాన్ని వదులుకోవటం లేదు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమమే అందుకు నిదర్శనం. ఏలూరులో విశ్వవిఖ్యాత నటుడు ఎస్వీ రంగారావు విగ్రహావిష్కరణ జరిగింది. ఆ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఎస్వీ రంగారావుకు, ఎన్టీఆర్ చాలా సన్నిహితులని చెప్పారు. నిజానికి చంద్రబాబు చెప్పినట్లుగా వారిద్దరూ అంత సన్నిహితులని సినీ ప్రముఖులెవరూ ఎప్పుడూ చెప్పలేదు. పైగా ఎన్టీఆర్ సిఫారసు వల్లే పాతాళభైరవి సినిమాలం ఎస్వీఆర్ కు నేపాళమాంత్రికుని పాత్ర వచ్చిందని చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే, ఎన్టీఆర్ కూడా అప్పటికి సినిమా ఫీల్డ్ కు కొత్తనే చెప్పాలి. ఈ విషయం కూడా ఏ పుస్తకంలోనూ ఎవరూ ప్రస్తావించలేదు. సరే, ఆ విషయాలను పక్కన పెడితే, కాపుల కోసం తమ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ఏకరువుపెట్టారు.
వేదిక మీదే కాపు రాజకీయం
విగ్రహావిష్కరణ కార్యక్రమంలో హటాత్తుగా కాపుల సంగతి ఎందుకు ప్రస్తావించినట్లు ? అంటే ఎస్వీ రంగారావు (ఎస్వీఆర్) కాపు సామాజికవర్గానికి చెందినవారన్న సంగతి అందరికీ తెలిసిందే. అందులోనూ ఉభయ గోదావరి జిల్లాలో కాపుల ప్రాబల్యం గురించి కొత్తగా వివరించాల్సిన అవసరంలేదు. పనిలో పనిగా ఎస్వీఆర్ విగ్రహం ఆవిష్కరించిన ప్రాంతాన్ని ఇకనుండి అందరూ ఎస్వీ రంగారావు జంక్షన్ అని పిలవాలని ఒకటికి మూడు సార్లు ప్రకటించారు. అయితే, విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ప్రాంతాన్నిఅప్పటికే ఎస్వీఆర్ మార్గ్ గా ప్రకటించినట్లు నిర్వాహకులు వేదికమీద చంద్రబాబు కు చెబితే కానీ తెలీలేదు.
జిల్లాతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు
ఇక అక్కడి నుండి కాపుల అభివృద్ధికి తాను చేస్తున్న కార్యక్రమాలను, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను, కాపులకు పార్టీ ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. పనిలో పనిగా పశ్చిమగోదావరి జిల్లాతో తెలుగుదేశంపార్టీకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పోయిన ఎన్నికల్లో టిడిపిని ఆధరించిన విషయాన్ని జనాలకు గుర్తు చేశారు. ఎందుకంటే, మొన్నటి వరకూ జగన్ పాదయాత్రలో జిల్లా జనాలు స్పందించిన విషయం టిడిపిలో కలవరపాటుకు గురిచచేశాయనటంలో సందేహం లేదు. అందుకనే 2014 ఎన్నికల ఫలితాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంటే ఏదో ఒకరకంగా జిల్లాలో వైసిపిని మళ్ళీ దెబ్బ కొట్టాలన్నవ్యూహమే చంద్రబాబు ప్రసంగమే కనిపిస్తోంది.
నాటి పరిస్ధితులు ఇపుడున్నాయా ?
అయితే, ఇక్కడ చంద్రబాబు మరచిపోయిన విషయం ఒకటుంది. 2014లో టిడిపిని ఈ జిల్లా ఆధరించిన విషయం అందరికీ తెలిసిందే. జిల్లాలోని 15 సీట్లలో టిడిపికి 14 సీట్లు వస్తే మిత్రపక్షం బిజెపికి ఒక సీటొచ్చింది. అయితే, అప్పట్లో టిడిపికి అన్ని సీట్లు రావటానికి కారణం బిజెపి, పవన్ కల్యాణే అన్న సంగతి కూడా అందరికీ తెలుసు. ఇపుడా ఇద్దరూ చంద్రబాబుతో లేరు. పైగా నాలుగేళ్ళ చంద్రబాబు పాలనపై జనాల్లో వ్యతిరేకత వచ్చేసింది. అదే సమయంలో జగన్ పాదయాత్ర పేరుతో జనాల్లో తిరుగుతున్నారు. కాబట్టి చంద్రబాబు ఎంత మొత్తుకున్నా పోయిన ఎన్నికల్లో వచ్చిన సీట్లు టిడిపికి వచ్చే ఎన్నికల్లో రావన్న విషయం అందరికీ అర్దమైపోయింది. మరి చంద్రబాబుకు ఎప్పుడర్దం అవుతుందో ఏమో ?