రాష్ట్ర విభజన హామీల అమలుపై కేంద్రప్రభుత్వం చేతులెత్తేసింది. హామీల అమలుకు సంబంధించి పాత పాటనే వినిపించింది. ఏపి విభజన హామీల అమలుపై తెలంగాణా కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి వేసిన పిటీషన్ పై కేంద్రం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఆ సందర్భంగా హామీల అమలుపై గడచిన నాలుగేళ్ళుగా పాడుతున్న పాటే వినిపించింది. దాంతో ప్రత్యేకహోదా లాంటి హామీలపై కేంద్రప్రభుత్వం చేతులెత్తేసిన విషయం అర్ధమవుతోంది.
ప్రజాస్వామ్యానికే అవమానం
రాష్ట్ర విభజన సందర్భంగా రాజ్యసభలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను అమలు చేయటం సాధ్యం కాదని నిసిగ్గుగా నరేంద్రమోడి సర్కార్ తన చేతకాని తనాన్ని ఒప్పుకుంది. రాజ్యసభలో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీకి తరువాత వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడి గౌరవించలేదంటే ప్రజాస్వామ్యాన్ని అవమానించటమే. పైగా ప్రత్యేకహోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజి అమలు చేస్తున్నట్లు అఫిడవిట్ లో పేర్కొంది. ప్రత్యేక ప్యాకేజిలో భాగంగా ఏమి ఇస్తోందో ఎవరికీ స్పష్టత లేదు.
రెవిన్యు లోటు ఎప్పటికి భర్తీ అయ్యేను ?
ఇక, రెవిన్యూలోటు భర్తకి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పింది. విభజన జరిగిన నాలుగేళ్ళకు కూడా రెవిన్యూ లోటు భర్తీకి ఇంకా చర్యలు తీసుకుంటోందంటే ఏమిటర్ధం ? రూ 4117 కోట్ల రెవిన్యూలోటుకు ఇప్పటి వరకూ రూ. 3979 కోట్లు భర్తీ చేసినట్లు అఫిడవిట్ లో పేర్కొంది. మిగితా మొత్తాన్ని తగిన సమయంలో ఇస్తుందట. తగిన సమయం అంటే అర్దం ఏంటి ?
కేంద్రం నుండి నిధులు అనుమానమేనా ?
అదే సమయంలో రాజధాని ప్రాంతంలో ప్రధాన భవనాలైన అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు వంటి వాటి నిర్మాణం నిమ్మితం రూ. 2500 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పింది. మరో వెయ్యి కోట్లు ఇచ్చే అవకాశం ఉందట. ఇచ్చిన నిధులకు వినియోగపత్రాలు ఇస్తే మిగిలిన మొత్తాన్ని ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇక్కడే అసలు సమస్యంతా ఉంది. కేంద్రమేమో ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పమంటోంది. చంద్రబాబేమో నిధులకు లెక్కలు చెప్పేది లేదంటున్నారు. కాబట్టి కేంద్రం నుండి నిధులు వచ్చే అవకాశం లేదని అర్ధమైపోతోంది.
ఏపిపై ఆశలు వదులుకున్నట్లేనా ?
ఇక, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఇచ్చిన రూ. 1050 కోట్లకు కూడా కేంద్రం లెక్కలడుగుతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని 100 శాతం కేంద్రమే భరిస్తోందని స్పష్టంగా చెప్పింది. నీతి అయోగ్ సూచన ప్రకారమే ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను రాష్ట్రానికి అప్పగించినట్లు చెప్పింది. చంద్రబాబేమో ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రమే రాష్ట్రప్రభుత్వానికి అప్పగించిందని చెబుతున్నారు. సో, తాజాగా కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ ను చూస్తే, వచ్చే ఎన్నికల్లో ఏపిలో బిజెపికి ఒక్క సీటు కూడా వస్తుందన్న ఆశ జాతీయ నాయకత్వానికి లేదన్నది స్పష్టంగా తెలుస్తోంది. మరి దీని ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఎలాగుంటుందో చూడాల్సిందే.