ఎన్నికలు ముంచుకొస్తున్న నేపధ్యంలో రాజకీయ సమీకరణలు చాలా వేగంగా మారిపోతున్నాయి. మొత్తం 13 జిల్లాల్లోనూ అధికార పార్టీ నేతలు అక్కడక్కడ కొందరు ప్రజా ప్రతినిధులు వైసిపిలోకి మారిపోవటానికి సిద్దపడుతున్నారు. అందుకు తగ్గట్లుగా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇదంతా ఎందుకంటే, తాజాగా ప్రకాశం జిల్లా నేతలపై సోషల్ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది. జరుగుతున్న ప్రచారం బట్టి త్వరలో చంద్రబాబుకు జిల్లాలోని కొందరు నేతలు పెద్ద షాకే ఇవ్వనున్నట్లు అర్దమవుతోంది.
త్వరలో వైసిపిలోకి కరణం ?
అందుబాటులో ఉన్న సమచారం ప్రకారం జిల్లా టిడిపిలోని సీనియర్ నేత, ఎంఎల్సీ కరణం బలరాం వైసిపిలో చేరనున్నట్లు సమాచారం. బలరాంతో పాటు కొడుకు కరణం వెంకటేష్ కూడా పార్టీ మారటం సహజమే కదా ? ఎప్పుడైతే కరణం ప్రత్యర్ధి, వైసిపి ఎంఎల్ఏ గొట్టిపాటి రవికుమార్ టిడిపిలోకి ఫిరాయించారో అప్పటి నుండి కరణంకు ఇబ్బందులు మొదలయ్యాయి. చంద్రబాబు వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చటానికి ప్రయత్నంచేసినా సాధ్యం కాలేదు. దాంతో ఏకంగా కరణంనే దూరంగా పెట్టటం మొదలుపెట్టారు. కరణాన్ని చంద్రబాబు దూరంగా పెట్టగానే మొత్తం జిల్లాలోని నేతలతో పాటు అధికారయంత్రాంగమంతా దూరం పెట్టేసింది. దాంతో కరణం చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకనే ఎంతో కాలం కరణం టిడిపిలో ఉండలేరన్నది వాస్తవం.
మాగుంట దారేది ?
ఇక, మరో ఎంల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిది మరో కథ. మంత్రిపదవి ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు తర్వాత పట్టించుకోవటం మానేశారు. దాంతో మాగుంటను కూడా జిల్లాలోని నేతలెవరూ పట్టించుకోవటం లేదు. దాంతో చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చినా మాగుంట పాల్గొనటం లేదు. అదే సమయంలో వైసిపి నేతలతో టచ్ లో ఉన్నట్లు సమాచారం. వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి నుండి స్పష్టమైన హమీ వస్తే వెంటనే వైసిపిలో చేరటానికి సిద్దంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
వైసిపికి మద్దతుగా దగ్గుబాటి
అదే పద్దతిలో దగ్గుబాటి వెంకటేశ్వర్రావు కూడా త్వరలో వైసిపిలో చేరుతారంటూ జిల్లాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. దగ్గుబటి అంటే ప్రస్తుతం వెంకటేశ్వరరావని ఎవరూ అనుకోరు. ఎందుకంటే, దగ్గుబాటి అంటే కేంద్ర మాజీమంత్రి, బిజెపి నేత పురంధేశ్వరనే అర్ధం. ఇటీవల వెంకటేశ్వర్రావు, ఒంగోలు మాజీ ఎంపి వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డితో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. పర్చూరు నుండి కొడుకు దగ్గుబాటి చెంచురామ్ ను ఎంఎల్ఏగా పోటీ చేయించాలని అనుకుంటున్నట్లు సమాచారం.
మానుగుంట చేరిక ఎప్పుడు ?
జగన్ గనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే తండ్రి, కొడుకులు వైసిపిలో చేరటం ఖాయమట. మరి తండ్రి, కొడుకులు వైసిపిలో చేరిన తర్వాత పురంధేశ్వరి మాత్రం బిజెపిలో ఉండి ఏం చేస్తారు ? అలాగే, మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మానుగుంట మహీధర్ రెడ్డి కూడా వైసిపిలో చేరనున్నట్లు ఎప్పటి నుండో ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. రేపటి రోజున ఇంకెంతమంది టిడిపి, బిజెపి, కాంగ్రెస్ నేతలు వైసిపిలో చేరుతారో చెప్పలేం.