ఇటువంటి చీడపురుగుల వల్లే విద్యావ్యవస్ధ భ్రష్టుపట్టిపోతోంది. అన్యాయంగా లక్షలాది మంది విద్యార్ధుల జీవితాలతో చెలగాటమాడుతున్న చీడపురుగలపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకున్నపుడే ఒక రోజు కాకపోయినా మరొకరోజైనా విద్యావ్యవస్ధ బాగుపడుతుంది. ఈపాటికే విషయం అర్ధమైఉంటుంది. తెలంగాణాలో రెండేళ్ళ క్రితం వెలుగు చూసిన ఎంసెట్-16 గురించే ఈ బాధంతా. అప్పట్లో ఓ పదిమంది విద్యార్ధులకు లబ్ది చేకూర్చటం కోసం లక్షలాదిమంది విద్యార్ధుల భవిష్యత్తును ఫణంగా పెట్టారు కొంతమంది 'విద్యావేత్తలు'.
నిజం నిప్పులాంటిది
నిజం నిప్పులాంటిదంటారు పెద్దలు. అదేవిధంగా కొందరు స్వర్ధపరులు చేసిన పని మొత్తానికి బయటపడింది. దాంతో తీగ లాగితే డొంకంతా బయటపడింది. శ్రీచైతన్య జూనియర్ కాలేజి చైతన్యపురి బ్రాంచిలోని డీన్ వాసుబాబు, శ్రీ చైతన్య-నారాయణ కాలేజ్ ఏజెంటు నారాయణరావుతో పాటు న్యూఢిల్లీలోని డాక్టర్ ధనుంజయ్, డాక్టర్ సందీప్ కుమార్ లాంటి మరికొందరు ఒక రింగ్ లాగ తయారయ్యారు. ఎంసెట్ లో ర్యాంకు సాధించాలని ఆరాటపడుతున్న విద్యార్దులపై వలేశారు. విద్యార్ధును ముందు ఉచ్చులోకి దించి తర్వాత వాళ్ల తల్లి దండ్రులను కూడా లాగారు.
పేపర్ లీకేజి కోసం ఏకంగా క్యాంపు
వ్యవహారం అంతా కాలేజీల పెద్దలు సెటిల్ చేసిన తర్వాత ఢిల్లీలోని డాక్టర్లిద్దరూ హైదరాబాద్ లో దిగారు. విద్యార్ధులను, వారి తల్లి దండ్రులను ఒక బ్యాచ్ గా తయారుచేశారు. ఎంసెట్ పరీక్షకు ముందు జూలైలో కాన్పూరులో ప్రత్యేకంగా ఒక క్యాంపు నిర్వహించారు. ఎంసెట్లో రాబోయే పేపర్ ను వాళ్ళ చేతికిచ్చి విద్యార్ధులతో ప్రాక్టీస్ చేయించారు. అందరూ బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ కు తీసుకొచ్చి ఎంసెట్ రాయించారు.
ముగ్గురుకి అత్యుత్తమ ర్యాంకులు
ఎంసెట్ పరీక్ష రాసిన ఆరుగురు విద్యార్ధుల్లో రాష్ట్రస్ధాయిలో అత్యుత్తమ ర్యాంకులు వచ్చాయి. అంటే పేపర్ లీకేజి ఎంత పకడ్బందీగా చేశారో అర్దమైపోతోంది. మంచి ర్యాంకులు తెచ్చుకున్న ముగ్గురు విద్యార్ధులను చైతన్య కాలేజీ ప్రకటనల్లో కూడా వాడుకుంది. ఇక్కడే ప్లాన్ అడ్డం తిరిగింది. ర్యాంకులొచ్చిన విద్యార్ధులకు అంత సీన్ లేదన్న విషయం వాళ్ళతో చదివిన విద్యార్ధులకు బాగా తెలుసు. అందరిలోనూ ఎక్కడో అనుమానం మొదలైంది. అనుమానానికి ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్ధుల ప్రవర్తన కూడా ఊతమిచ్చింది. దాంతో ఆరోపణలు మొదలయ్యాయి. చివరకు అనుమానమే పెనుభూతమై విద్యార్ధుల ఆందోళనలు చేసేదాకా చేరుకుంది. దాంతో ప్రభుత్వం కూడా ఆందోళనలపై దృష్టి పెట్టింది. పోలీసుల విచారణకు ఆదేశించింది.
చీడపురుగుల సంగతి న్యాయస్ధానమే తేల్చాలి
చివరకు విద్యార్ధులను, వారి తల్లి దండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకేముంది బండారమంతా బయటపడింది. విద్యార్ధులకు ఎంసెట్ పేపర్ ను ముందుగానే అందించిన వారి గోత్రనామాలు మొత్తం బయటపడింది. తీగలాగేకొద్దీ డొంకంతా కదులుతుండటంతో ప్రభుత్వం కేసు విచారణను పోలీసుల నుండి తప్పించి సిఐడికి అప్పగించింది. అప్పటికే అదుపులో ఉన్న వాళ్ళ మొబైల్ ఫోన్ల కాల్ డేటాలు సేకరించినపుడు విషయం మొత్తం బయటపడింది. దొరికిన ఆధారాలతో రెండేళ్ళపాటు కేసును దర్యాప్తు చేసిన సిఐడి అధికారులు చివరకు కళాశాలకు చెందిన వాసురావు, నారాయణరావుతో పాటు డాక్టర్లను కూడా అరెస్టు చేశారు. రేపో మాపో కోర్టు బోనెక్కబోతున్న ఈ చీడపురుగులకు ఎటువంటి శిక్ష విధిస్తుందో న్యాయస్ధానమే తేల్చాలి.