జనసేనకు సంబంధించి మెగా ఫ్యామిలీలో ముసుగులు మెల్లిగా తొలిగిపోతున్నాయి, పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి ఐదేళ్ళయినా మద్దతు విషయంలో ఇప్పటి వరకూ మెగా ఫ్యామిలి గుంభనంగా ఉందనే చెప్పాలి. మద్దతు విషయంలో మెగా బ్రదర్స్ ను మీడియా అడిగినా అటు చిరంజీవి కానీ ఇటు నాగుబాబు తదితరులు కానీ స్పష్టంగా చెప్పకుండా ఏదో ఒకటి చెప్పి జారుకుంటున్నారు. ఇటువంటి నేపధ్యంలోనే కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంటోంది. అదేమిటంటే, మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడు, చిరంజీవి అభిమాన సంఘాల అధ్యక్షుడు స్వామినాయుడు జనసేనలో చేరుతున్నారు.
చిరంజీవి మాటే స్వామినాయుడు బాట
మామూలుగా అయితే, చిరంజీవి ఎక్కడుంటే స్వామినాయుడు కూడా అక్కడుంటారు. చిరంజీవి రాజకీయాల్లోకి రాకముందు నాయుడు కూడా కేవలం సినిమా ప్రపంచానికి పరిమితమయ్యారు. ఎప్పుడైతే ప్రజారాజ్యం ఏర్పాటైందో వెంటనే నాయుడు కూడా ప్రజారాజ్యంలో చేరారు. తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం దుకాణం మూసేసి కాంగ్రెస్ లో కలిసినపుడు నాయుడు కూడా కాంగ్రెస్ లో చేరారు. చిరంజీవి యాక్టివ్ గా ఉన్నంత కాలం నాయుడు కూడా యాక్టివే. చాలాకాలంగా చిరంజీవి స్తబ్దుగా ఉంటున్న కారణంగా నాయుడు ఉనికి కూడా ఎక్కడా కనబడటం లేదు.
అభిమానులు, సామాజికవర్గాన్నే నమ్ముకున్నారా ?
ఈ నేపధ్యంలోనే హటాత్తుగా నాయుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈనెల 9వ తేదీన హైదరాబాద్ లో జనసేనలో చేరుతున్నట్లు నాయుడు ప్రకటించారు. తనతో పాటు చిరంజీవి అభిమాన సంఘాల సభ్యులు కూడా కాంగ్రెస్ కు రాజీనామా చేసి జనసేనలో చేరుతున్నట్లు చెప్పారు. ఈ చేరికలు మొత్తాన్ని చిరంజీవి సోదరుడు నాగుబాబు పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఇక్కడే మ్యాటర్ వెరీ క్లియర్. జనసేనలోకి స్వామినాయుడు చేరుతున్నారంటే చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ మొత్తం అంటే రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ, వరుణ్ తేజ్ తదితరులు జనసేనలోకి దూకే టైం దగ్గర పడ్డట్లే. ఎందుకంటే, చిరంజీవి ఆదేశాలు, అనుమతి లేకుండా స్వామినాయుడు ఏ పనీ చేయరు. ఇపుడు కూడా ముందు స్వామి జనసేనలోకి చేరుతున్నారంటే చిరంజీవి కూడా జనసేనలోకి వస్తున్నట్లు అర్ధమవుతోంది. కాకపోతే ముహూర్తం ఎప్పుడన్నదే తేలాలి.
ఎన్టీఆర్ బాటలోనే పవన్ ?
ఇక, జనసేన విషయానికి వస్తే ఇప్పటి వరకూ రంగు, రుచి, రూపు మొత్తం పవన్ కల్యాణే అన్న విషయం ప్రత్యేకంగా చెప్కక్కర్లేదు. నిజానికి సాధారణ ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్న సమయంలో కూడా పార్టీ నిర్మాణం జరగకపోవటం ఆశ్చర్యమే. చూడబోతే గతంలో తెలుగుదేశం పార్టీ పెట్టినపుడు ఎన్టీఆర్ పద్దతిలోనే జనసేనను నడపాలని పవన్ ఆలోచిస్తున్నట్లు కనబడుతోంది. 1982లో ఎన్టీఆర్ టిడిపిని పెట్టినపుడు కూడా పార్టీ నిర్మాణం చేయకుండానే ఎన్నికల్లో పాల్గొని ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించారు. కాకపోతే అప్పటి పరిస్ధితులు ఇపుడు లేవన్న విషయం స్పష్టం. అయినా పవన్ పార్టీ నిర్మాణంపై ఆలోచించటం లేదంటే కేవలం అభిమానులు, కాపు సామాజికవర్గాన్ని మాత్రమే నమ్ముకున్నట్లు అర్ధమవుతోంది. ఇటువంటి నేపధ్యంలో జనసేనకు మెగా ఫ్యామిలి ప్రత్యక్షంగా పూర్తి మద్దతు ప్రకటిస్తే ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో......