నాలుగేళ్ళు ప్రపంచస్ధాయి రాజధాని అని ఊదరగొట్టిన చంద్రబాబునాయుడు తాజాగా ప్రపంచస్ధాయి నగరాల నిర్మాణమంటూ సింగపూర్ పర్యటనకు బయలుదేరారు. చంద్రబాబు మందీ మార్బలంతో మళ్ళీ సింగపూర్ కు వెళ్ళారు. మూడు రోజుల పాటు సింగపూర్ లో జరగనున్న 'ప్రపంచ నగరాల' పై జరుగుతున్న సదస్సులో పాల్గొనేందుకు చంద్రబాబు బయలుదేరారు. ఈ సదస్సులో పాల్గొనటం వల్ల ఏపికి వచ్చే ఉపయోగమేంటని ఎవరు ప్రశ్నించకూడదు. ఎందుకంటే, అలా ప్రశ్నించేవారంతా చంద్రబాబు దృష్టిలో అభివృద్ధిని అడ్డుకుంటున్న ద్రోహులే.
గత పర్యటనల వల్ల ఉపయోగమేంటి ?
ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి చంద్రబాబు తన పరివారంతో దాదాపు 17 విదేశీయానాలు చేశారు. సుమారు 15 దేశాల్లో పర్యటించారు. ఎందుకు పర్యటించారంటే ? ఏపి అభివృద్ధిలో విదేశీ భాగస్వామ్యాల కోసమని, విదేశీ పెట్టుబడుల కోసమంటూ చాలా కథలే చెప్పారు. ఇక సింగపూర్ కు అయితే రాజధాని నిర్మాణమని, ప్లాన్లని అదని, ఇదని చాలా సార్లే తిరిగారు. అంటే మొదటి నాలుగేళ్ళల్లో చంద్రబాబు చేసిన విదేశీప్రయాణల వల్ల ఏ మేరకు ఉపయోగం కనబడిదంటే ఎవరూ చెప్పలేరు.
అసలు విదేశీ పర్యటనలెందుకు ?
రాజధాని డిజైన్లని, నిర్మాణమని, పెట్టుబడుల పేరుతో చంద్రబాబు మాత్రమే కాదు మంత్రులు, ఉన్నతాధికారులు కూడా విదేశాలకు చాలా సార్లే వెళ్ళారు. ఎవరి పర్యటనల వల్ల కూడా ఉపయోగం కనబడలేదు. మరెందుకు విదేశాల్లో పర్యటించారు ? అంటే పర్యటన ఖర్చులు మొత్తం ప్రజాధనమే కాబట్టి. వెళ్ళిన వారెవ్వరూ సొంత డబ్బులు పెట్టుకోలేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఒక విధంగా వారి పర్యటనలు మొత్తం హాలిడే ట్రిప్పులుగానే ముగిసిపోయాయి.
ప్రజాధనం వృధా తప్ప ఒరిగేదేం లేదా ?
అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి నాలుగేళ్ళపాటు విదేశాల్లో చేసిన పర్యటనలకే ఎటువంటి ఉపయోగం కనబడలేదు. ఇక చివరి ఆరుమాసాల్లో చేసే విదేశీ పర్యటనల వల్ల ఉపయోగం ఉంటుందని ఎవరైనా అనుకుంటారా . షెడ్యూల్ ప్రకారమైతే వచ్చే మే నెలలోను ముందస్తు ఎన్నికలైతే ఈ ఏడాది చివరిలోనే ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ముందస్తు ఎన్నికలే నిజమైతే చంద్రబాబే కాదు ఎవరు విదేశీ ప్రయాణాలు చేసినా ప్రజాధనం వృధా తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే, మొదటి నాలుగేళ్ళల్లో ఏమీ సాధించలేని వాళ్ళు చివరి ఆరు మాసాల్లో ఏం సాధిస్తారు ?