పోలవరం ప్రాజెక్టు దగ్గరకు తెలుగుదేశంపార్టీ పోటీ యాత్రలకు సిద్ధమవుతోంది. ఈనెల 11వ తేదీన ప్రాజెక్టును సందర్శించేందుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వస్తున్న విషయం తెలిసిందే. అసలే ప్రాజెక్టు పనులు వివాదాస్పదమైంది. ఎన్డీఏలో నుండి చంద్రబాబునాయుడు బయటకు వచ్చేసిన తర్వాత మొదటిసారిగా గడ్కరీ ప్రాజెక్టును తనిఖీ చేసేందుకు వస్తున్నారు. మరి కేంద్రమంత్రి వస్తున్నపుడు స్ధానిక బిజెసి నేతలు ఉండకుండా ఉంటారా ? అందుకనే గడ్కరీ రాకను పునస్కరించుకుని బిజెపి భారీ ప్రోగ్రామ్ పెట్టుకుందట.
పోలవరానికి టిడిపి యాత్ర
ఇక్కడే సమస్య మొదలైంది. ఎలాగంటే కేంద్రమంత్రితో పాటు వీలైనంతమంది బిజెపి నేతలు, కార్యకర్తలు పోలవరం చేరుకునేందుకు కార్యక్రమం సిద్దమైంది. మరి అధికార పార్టీ ఊరుకుంటుందా ? అందుకనే గడ్కరీ ప్రోగ్రాంకు ముందుగానే టిడిపి నేతలను విడతల వారీగా ప్రాజెక్టు దగ్గరకు పంపటానికి ప్లాన్ జరుగుతోంది. మంత్రులు, ఎంపిలు ఎంఎల్ఏలతో పాటు నేతలను కూడా కలిపి యాత్రలకు చంద్రబాబు సిద్ధం చేస్తున్నారు. అంటే మరో రెండు రోజుల్లో పోలవరం కేంద్రంగా కొద్ది రోజులు రాజకీయం వేడెక్కే అవకాశం ఉందన్న మాట.
గడ్కరీ ఏం మాట్లాడుతారు ?
ఇప్పటికే పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారంటూ బిజెపి ఎఎంల్సీ సోము వీర్రాజు లాంటి నేతలు ప్రతీరోజూ ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణలను తిప్పికొట్టడం టిడిపికి తలనొప్పిగా తయారైంది. దానికితోడు గడ్కరీ చేత కూడా అటువంటి ఆరోపణలే చేయిస్తే ఇంకేమన్నా ఉందా ? ఒక్కసారిగా రాజకీయం వేడెక్కిపోదూ ? అందుకనే బిజెపి యాత్రకు పోటీగా టిడిపి కూడా ముందే ఓ యాత్రను ప్లాన్ చేస్తోందన్న మాట.