భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తప్పు చేశారా ? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోనూ అవే అనుమానాలు మొదలైనట్లే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో బిజెపి పరిస్ధితి ఏంటో అందరికీ తెలిసిందే. పోయిన ఎన్నికల్లో గెలిచిన నాలుగు అసెంబ్లీ సీట్లు, రెండు ఎంపి సీట్లు కూడా గెలుచుకుంటుందో లేదో అనుమానమే. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పై జనాల్లో ఉన్న ఆగ్రహమేంటో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కానీ బయటపడలేదు. ఫలితాలు వచ్చిన తర్వాత చూస్తే మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్ధానాల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది.
కన్నాపై చెప్పులతో దాడి
కాంగ్రెస్ పై జనాల్లో ఉన్న ఆగ్రహమేంటో ఫలితాలు వచ్చిన తర్వాతే తెలిసింది. వచ్చే ఎన్నికల్లో బిజెపికి జరగబోయే సత్కారమేంటో ముందుగానే సూచనలు అందుతున్నాయి. మొన్న బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై కావలిలో చెప్పులతో జరిగిన దాడికి అర్ధమేంటి ? అంతేకాకుండా అడ్డుగోలు రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ ఏపికి తీరని అన్యాయం చేస్తే, బిజెపి-టిడిపిలు నమ్మక ద్రోహమే చేశాయనటంలో సందేహం అవసరం లేదు. రెండు పార్టీలు కలిసున్నపుడే బిజెపి పరిస్ధితి అంతంతమాత్రంగానే ఉండేది. అటువంటిది రెండు పార్టీలు విడిపోయిన తర్వాత బిజెపి పరిస్ధితి మరింత అధ్వాన్నంగా తయారైంది.
పోటీకి అభ్యర్ధులు దొరుకుతారా ?
ఈ నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో బిజెపి పరిస్ధితి ఏ విధంగా ఉండబోతోందో ఎవరికి వారు సులభంగానే అంచనా వేసుకోవచ్చు. నిజానికి ఒంటరిగా పోటీ చేసేంత సీన్ బిజెపికి లేదు. పోటీ సంగతి సరే ముందు 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధుల జాబితాను ప్రకటిస్తే చాలు. ఇటువంటి పరిస్ధితుల్లో కన్నా రాష్ట్ర పగ్గాలందుకున్నారు. పార్టీ పరిస్దితి తెలిసీ పగ్గాలందుకున్నందుకు ఇపుడు తీరిగ్గా అనుభవిస్తున్నట్లే ఉంది. అసలు వచ్చే ఎన్నికల్లో తాను గెలవటమే అనుమానమట. ఈ పరిస్దితుల్లో మిగిలిన వాళ్ళ గురించి ఏమాలోచిస్తారు ?
వైసిపి బస్సును మిస్ చేసుకున్నారా ?
తన సారధ్యంలో పార్టీకి సీట్లు తగ్గినా లేకపోతే ఒక్కసీటు గెలవకపోయినా అంతకుమించిన అవమానం ఏముంటుంది కన్నాకు ? వైసిపిలో చేరేందుకు కన్నా ఆ మధ్య బిజెపిలో దుకాణం కూడా సర్దేసుకుని చివరి నిముషంలో మళ్ళీ ఆగిపోయారు. లేకుంటే వైసిపిలో కన్నా పరిస్ధితి కంఫర్టబుల్ గా ఉండేదనటంలో సందేహం లేదు. ఎందుకంటే, కన్నాకు గట్టి పార్టి అవసరం. అదే సమయంలో వైసిపికి కూడా గుంటూరు జిల్లాలో సీనియర్ నేత అవసరం. కాబట్టి కన్నాకు మంచి ప్రాధాన్యతే ఉండేదనటంలో సందేహం లేదు. అటువంటిది బిజెపి ప్రస్తుత పరిస్ధితితో పాటు తన పరిస్ధితిని భేరీజు వేసుకోకుండానే ఉంటారా ?