కార్మిక, ఉపాధి శాఖల మంత్రి పితాని సత్యానారాయణకు ప్రభుత్వమే నోటీసులు జారీ చేసింది. చేపల చెరువులకు అనుమతులు తీసుకుని రొయ్యల చెరువులుగా మార్చటంతో మంత్రికి సమస్యలు మొదలయ్యింది. పశ్చిమగోదావరి జిల్లాలోని పోడూరు మండలంలో భారీ ఎత్తున రొయ్యల చెరువులున్నాయి. వాటివల్ల పర్యావరణానికి పెద్ద ఎత్తున విఘాతం కలుగుతోంది. ఈ విషయమై ప్రభుత్వానికి స్ధానికులు ఎంత మొత్తుకున్నా ఉపయోగం లేకపోయింది.
చేపల చెరువుల పేరుతో రొయ్యల సాగు
ఇదే విషయమై ఓ బాధితుడు న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. దాంతో కోర్టు ప్రభుత్వానికి నోటీసులిచ్చి విచారణ జరిపించమని ఆదేశించింది. దాంతో మత్స్యశాఖ ఉన్నతాధికారులు రంగంలోకి దిగాల్సొచ్చింది. అందులో భాగంగానే జిల్లా కలెక్టర్ రొయ్యల చెరువులున్న వారందరికీ నోటీసులిచ్చారు. అంటే సుమారు 82 మంది చెరువుల ఓనర్లకు నోటీసులు అందాయి. అందులో మంత్రి పితాని చెరువులు కూడా ఉన్నాయి. అంటే మిగిలిన వాళ్ళలాగానే మంత్రి కూడా చేపల చెరువులకు అనుమతి తీసుకుని రొయ్యల చేరువులు చేస్తున్నట్లు బయటపడింది. దాంతో చెరువులపై సర్వే చేసిన అధికారులు మంత్రి పితానికి కూడా నోటీసులిచ్చారు. దాంతో ఈ విషయం ఇపుడు సంచలనంగా మారింది.
సంచలనంగా మారిన నోటీసుల పర్వం
మంత్రికి నోటీసులివ్వటం వెనుక ఏదైనా రాజకీయముందా అన్న విషయంపై ఇపుడు తెలుగుదేశంలో చర్చ మొదలైంది. ఎందుకంటే, పితాని త్వరలో వైసిపిలోకి జంప్ చేస్తారంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా చంద్రబాబు చేయించుకున్న సర్వేల్లో మంత్రి గెలవడంటూ నివేదిక అందిందని కూడా పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇటువంటి నేపధ్యంలోనే చేపల చెరువులు, రొయ్యల చెరువలంటూ ఉన్నతాధికారులు హడావుడి చేయటం నోటీసులివ్వటం జిల్లాలో సంచలనంగా మారింది.