చంద్రబాబునాయుడుకు అనంతపురం తలనొప్పులు వదిలేట్లు లేదు. అసలే మంత్రి పరిటాల సునీత-ధర్మవరం ఎంఎ్ఏ వరదాపురం సూర్యనారాయణ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమంటోందన్న సంగతి అందరికీ తెలిసిందే. అటువంటి సమస్యే తాజాగా మళ్ళీ రెండు వర్గాల మధ్య మొదలైంది. ఈరోజు అనంతపురంలో ఫ్లెక్సీల గొడవ తారస్ధాయికి చేరుకుంది. దీక్ష చేస్తున్న ఎంపిల వేదిక వద్ద ఏర్పాటు చేసిన సూరి ఫ్లెక్సీలను గుర్తు తెలీని వ్యక్తులు చించేశారు. దాంతో వివాదం బాగా రాజుకుంది.
చంద్రబాబునే లెక్క చేయటం లేదు
చాలా కాలంగా రెండు వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. రెండు వర్గాలు ఒకదానిపై మరొకటి దాడులు చేసుకోవటం, పోలీసు స్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు చేసుకోవటం చాలా సార్లే జరిగాయి. ఎప్పటికప్పుడు చంద్రబాబు ముందుకు పంచాయితీలు రావటం సిఎం సర్దిచెప్పటం అవుతోంది. అంతేకానీ రెండు వర్గాల్లో ఏ ఒక్కటీ చంద్రబాబు మాటను వినటం లేదు. దాంతో ఎప్పటికప్పుడు గొడవలవుతునే ఉన్నాయి. ఇటువంటి పరిస్దితుల్లో తాజాగా ఫ్లెక్సీల చించివేత పట్టణంలో ఉద్రిక్తతకు దారితీసింది.
ఎస్పీకి ఎంఎల్ఏ ఫిర్యాదు
పరిటాల వర్గీయులే ఎంఎల్ఏ ఫ్లెక్సీలను చించేశారంటూ సూరి వర్గీయులు మండిపోతున్నారు. దాంతో ఎంఎల్ఏ సూరి ఈసారి నేరుగా ఎస్పీకే ఫిర్యాదు చేశారు. అదే సమయంలో ఫ్లెక్సీలు చించేసిన కొందరిని పట్టుకున్నా వెంటనే పోలీసులు వదిలేసినట్లు కూడా ఎంఎల్ఏ తన ఫిర్యాదులో పేర్కొనటం గమనార్హం. ఒకవైపు లోకేష్ కర్నూలు జిల్లాలో పెట్టిన కొత్త చిచ్చు ఆరకముందే అనంతపురంలో ఫ్లెక్సీల గొడవ ముదిరిపోవటంతో చంద్రబాబుకు తలనొప్పులు రోజురోజుకు పెరుగుతున్నాయి.