చంద్రబాబునాయుడులో టెన్షన్ పెరిగిపోతోంది. ఒకవైపు ఎన్నికలు తరుముకొచ్చేస్తోంది. ఇంకోవైపు ప్రతిపక్షాల్లో కాంగ్రెస్ మినహా మిగిలిన పార్టీలన్నీ చంద్రబాబుపై దాడులు పెంచేస్తున్నాయి. ప్రతిపక్షాల దాడులను తిప్పికొట్టలేక టిడిపి నేతలు నానా అవస్తలు పడుతున్న విషయం స్పష్టమైపోతోంది. గతంలో ఎప్పుడు కూడా చంద్రబాబు ఇటువంటి పరిస్దితిని ఎదుర్కొని ఉండరు. దాంతో ప్రతిపక్షాలను ఒంటరిగా ఎదుర్కోలేక చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది.
అన్ని వైపుల నుండి కమ్ముకుంటున్న దాడులు
పాదయాత్రతో ఒకవైపు వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి దూసుకుపోతున్నారు. ప్రజాపోరాటయాత్ర పేరుతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇంకోవైపు చంద్రబాబు, లోకేష్ పై విరుచుకుపడుతున్నారు. వీళ్ళిద్దరూ చాలరన్నట్లు భారతీయ జనతా పార్టీ కూడా ప్రతీరోజు చంద్రబాబుపై ఆరోపణలతో ధ్వజమెత్తుతోంది. మరోవైపు కేంద్రప్రభుత్వం నుండి సహాయనిరాకరణ అందరికీ తెలిసిందే. ఒకేసారి నాలుగు వైపుల నుండి కమ్ముకుంటున్న దాదుల నుండి ఎలా బయటపడాలో చంద్రబాబుకు అర్ధం కావటం లేదు.
లోకేష్ పరిస్ధితేంటి ?
ప్రతిపక్షాలు ఇంతగా చంద్రబాబుపై ఆరోపణలతో విరుచుకుపడుతున్నా ధీటుగా సమాధానం చెప్పగలిగిన నేతలు టిడిపిలో కనబడటం లేదు. మాట్లాడితే ఎంతసేపు చంద్రబాబు మీడియాలో మాట్లాడటం లేకపోతే ఏదో ఒక సభ పెట్టి చంద్రబాబు మాట్లాడాల్సిందే. పేరుకే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి కానీ ధీటుగా ప్రతిపక్షాలను ఎదుర్కొనే సామర్ధ్యం లోకేష్ లో కనబడటం లేదు. ఏదో ముఖ్యమంత్రి కొడుకు, మంత్రి అనే ట్యాగ్ లైన్ తో నెట్టుకొచ్చేస్తున్నారంతే. ఎందుకంటే, లోకేష్ ఎక్కడ మాట్లాడినా నవ్వుల పాలవుతున్న విషయం అందరూ చూస్తున్నదే. కాబట్టి లోకేష్ సామర్ధ్యంపై చంద్రబాబు కూడా నమ్మకం పెట్టుకున్నట్లు కనబడటం లేదు.
టిడిపి తరపున యాత్రలు లేవా ?
వైసిపి, జనసేన అధినేతలు పాదయాత్ర, ప్రజా పోరాట యాత్ర పేరుతో జనాల్లో తిరుగుతు చంద్రబాబు పాలనపై దుమ్ములేపేస్తున్నారు. బిజెపి కూడా వాళ్ళనే ఫాలో అవుతోంది. మరి, ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టటం ఎలా ? ఎంతకని చంద్రబాబు ఒక్కరే అవస్తలు పడతారా ? పార్టీ, ప్రభుత్వ వాదన వినిపించటానికి టిడిపిలో సమర్ధులు లేక చంద్రబాబు అవస్తులు పడుతున్నారు. నిజానికి ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనేంత సామర్ధ్యం ఉన్న నేతలు టిడిపిలో కనబడటం లేదు. ఏదో మీడియా దన్నుంది కాబట్టి చంద్రబాబు నెట్టుకొచ్చేస్తున్నారు.
రేపటి పరిస్దితేంటి ?
ఎన్నికలు ఇంకా ఏడాది ఉండగానే ప్రతిపక్షాలు ఈస్ధాయిలో చంద్రబాబుపై ఆరోపణలతో దాడులు చేస్తున్నాయి. రేపటి రోజున ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే పరిస్ధితేంటి ? ప్రతిరోజు జనాల్లో ఉండేందుక వీలుగా 120 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తున్న జగన్ ఈ కార్యక్రమం అయిపోగానే బస్సుయాత్రకు ప్లాన్ చేస్తున్నారు. మిగిలిన 55 నియెజకవర్గాల్లో బస్సుయాత్రను బహుశా ఎన్నికల నోటిఫికేషన్ ముందు చేపట్టవచ్చు. అంటే ఏదో ఒకరకంగా జనాల్లో ఉండేందుకే జగన్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అదే విధంగా పవన్ కూడా దశలవారీగా ప్లాన్ వేసుకున్నారు. మరి, ప్రతిపక్షాల యాత్రలను ఎదుర్కొనేందుకు ధీటుగా టిడిపి ఏమి చేస్తుంది ?