మనం ఎంత టెన్షన్ లో ఉన్నా..మూడు గంటలు రిలాక్స్ కోసం సినిమా థియేటర్లకు వెళ్తుంటాం. ఈ మద్య కాలంలో సామాన్యులకు సినిమా థియేటర్లకు వెళ్లాలంటే భయం పట్టుకుంది. ఇక మల్టీప్లక్స్ థియేటర్ల గురించి చెప్పక్కరలేదు..ఒక కుటుంబం వెళ్లాలంటే..జెబు గుల్లా అయినట్లే లెక్క. సినిమా చూడటానికి వెళ్తే ధియేటర్ యాజమాన్యాలు పలు రకాల ఫీజులతో పాటు.. బయట నుండి తెచ్చే తిను బండరాలపై నిషేధం విధిస్తున్నాయి. అలాగని లోపల ఏమైనా ఎం.ఆర్.పీ. రేట్లకే ఇస్తారా అదీ లేదు..అడ్డగోలు వసూళ్లు చేస్తున్నారు.
దీంతో ఇష్టారాజ్యంగా సాగుతున్న వసూళ్లను అడ్డుకునేవారే లేరా అనేది సగటు పౌరుడి మదిలో మెదిలే ప్రశ్న. తాజాగా దీనిపై అధ్యయనం చేసిన మహరాష్ట్ర ప్రభుత్వం ఓ సంచనల నిర్ణయం తీసుకుంది. సినిమా చూడటానికి వెళ్లేవాళ్లు తమ వెంట ఆహార పదార్థాలను తీసుకొని వెళ్లొచ్చని స్పష్టం చేసింది. అంతే కాదు ఆగస్టు 1 నుంచి అన్ని రకాల సినిమా హాళ్లు ఈ నిబంధనను పాటించాలని సూచించింది.
ఒకవేళ సినిమా థియేటర్లు ఈ నిబంధనను పాటించకుంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపైనా మహారాష్ట్ర ప్రభుత్వం ఓ విధానాన్ని రూపొందించాలనే ఆలోచనలో ఉంది. ఈ వివరాలను ఆ రాష్ట్ర ఆహార శాఖ మంత్రి రవీంద్ర చావన్ మీడియాకు తెలిపారు.
ఫుడ్ ఐటమ్స్తో సినిమాకు వెళ్తున్నవారిని ఇకపై ఎవరైనా అడ్డుకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. మహరాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలుసుకున్న తర్వాత తెలుగు రాష్ట్రాల ప్రజలు తమ ప్రభుత్వాలు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని భావిస్తున్నారు.